కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రబీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు సబ్కలెక్టరేట్ కె.మాధవిలత తెలిపారు. 497 కేంద్రాల్లో ఈ కొనుగోళ్లు జరుపుతున్నట్లు వివరించారు. కనీస మద్దతు ధరకు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని జేసీ కె.మాధవీలత సూచించారు. ఇప్పటివరకు రూ.8.46 కోట్ల విలువైన 4,531 మెట్రిక్ టన్నుల రబీ ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కృష్ణా జిల్లాలోని మిల్లులతో పాటు, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మిల్లులతోనూ అనుసంధానం చేసినట్టు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారం నిమిత్తం నగరంలోని విడిది కార్యాలయం నుంచి శనివారం ‘డయల్ యువర్ జాయింటు కలెక్టరు’ కార్యక్రమాన్ని జేసీ నిర్వహించారు. మొత్తం 30 మంది ఫోన్లు చేయగా, వీరిలో 25 మంది రైతులు తమ సమస్యలను తెలియజేశారు. విజయవాడ గ్రామీణ, తిరువూరు, ఎ.కొండూరు, చాట్రాయి, గంపలగూడెం మండలాల్లో ధాన్యం సేకరణ జరగడం లేదని రైతులు తెలిపారు. జేసీ స్పందిస్తూ.. ఈ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, విక్రయించుకోవచ్చని సూచించారు. వీరులపాడు నుంచి నాగిరెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం రవాణా ఛార్జీలను ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. జేసీ మాట్లాడుతూ.. రైసు మిల్లుల వారు వాహనాలను పంపిస్తారని, ఒక వేళ పొలం నుంచి రైతు ఏదైనా వాహనంలో మిల్లుకు తరలిస్తే.. ఛార్జీలను మిల్లర్లు చెల్లిస్తారని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 8,38,055 మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.1531.10 కోట్లను జమ చేసినట్టు వివరించారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు కె.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. ఆ పిచ్చుకలు, చిలకలే ఆయన నేస్తాలు.