వరద ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, ఆకివీడు తదితర మండలాల్లోని పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు భారీ వర్షాలకు నీటమునిగాయి. చేతి కందిన పంట పొలాలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక... వరి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది.
కాలువలు అన్ని ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రైతులు కూడా పంట పొలాల్లోకి వెళ్లేందుకు వీల్లేకుండా ఉంది. వరి పంట పొట్ట, ఈనిక దశలో ఉందని...ఈ సమయంలో వరద ముంచితే మొత్తం పోతుందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు. భీమవరంలోని లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వర్షం నీరు ఇళ్లల్లోకి రావటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.