ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో నూతన విధానం ప్రారంభించనుంది. ఇందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచడంతో పాటు నూతన విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానంలో కొనుగోలు కేంద్రాలు.. రైతు భరోసా కేంద్రాలకు.. అనుసంధానంగా పని చేయనున్నాయి. ధాన్యం దిగుబడి ఆధారంగా ప్రతి రైతుభరోసా కేంద్రానికి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దిగుబడి తక్కువగా ఉన్న చోట్ల రెండు, మూడు రైతు భరోసా కేంద్రాలకు కలిపి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అదనంగా 293 కేంద్రాలను పెంచారు. గత ఏడాది సీజన్లో 340 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ సీజన్లో అదనపు కేంద్రాలతో కలిపి 633 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నవంబర్ మొదటి వారంలో ఈ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
పంటను అమ్మే రైతులు సాగు విస్తీర్ణం, దిగుబడి పంట చేతికొచ్చే తేదీ, తదితర వివరాలను రైతు భరోసా కేంద్రాలు వద్ద నమోదు చేసుకోవాలి. నమోదుకు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతా నెంబరు, రైతు చరవాణి నెంబరు ఇవ్వాలి. రైతు భరోసాలో నమోదు కావాలంటే ఈ క్రాఫ్ లో రైతు నమోదు అయి ఉండాలి. రైతు నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా వారం రోజుల పాటు కొనసాగుతుంది.
కూపన్లు
రైతులు ధాన్యం నమూనాలను రైతు భరోసా కేంద్రం కానీ, కొనుగోలు కేంద్రానికి గానీ తీసుకెళ్తే తేమ పరిశీలించి కూపన్లు ఇస్తారు. అందులో తెలిపిన తేదీన పంట తీసుకుంటామని.. ఏ మిల్లుకు తరలించనున్నది వివరాలుంటాయి. ఆ సమయానికి లారీలు సమకూర్చి పొలం నుంచి నేరుగా ధాన్యం తరలించే ఏర్పాట్లు చేస్తారు. సొంత వాహనాలు ఉన్న రైతులు నేరుగా మిల్లులకు ధాన్యాన్ని తరలించవచ్చు. అందుకు రవాణా సౌకర్యం ఛార్జీలు చెల్లిస్తారు.
14 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు 14 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత రబీలో 11.05 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ప్రస్తుతం సాధారణ రకం క్వింటాలు 1,868 రూపాయలు, ఏ గ్రేడ్ రకం 1,888 రూపాయలకు కొనుగోలు చేయనున్నారు.
నవంబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించామని జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. వీటిని పెంచటం వల్ల రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఇవీ చదవండి: 'వ్యవసాయం లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యం'