క్యారేజీలు మోసుకెళ్తున్న ఈ మహిళ.. ఏ పోలం పనికో వెళ్లడంలేదు. వాళ్ల ఊళ్లోని వృద్ధులకు ఆహారం అందించేందుకు వెళ్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ.. ఆమె ఈ భోజనాన్ని అందిస్తారు. సుమారు 25 మందికి రెండుపూటలా ఇలా ఆహారాన్ని చేరవేస్తారు. ఈ బాధ్యతను ఊళ్లోని క్షత్రియసేవా సంఘం నిర్వహిస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకుమిల్లిలో ఉంది ఈ క్షత్రియసేవా సంఘం. ఊరి నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్లి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న వారు.. ఈ సేవా కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు. గ్రామంలోని కొందరు ఈ సంఘం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పిల్లలు లేక, వయసుపైబడి వంట చేసుకోలేని వృద్ధులకు ఈ సంఘం ఆహారాన్ని అందిస్తోంది. రెండు పూటలా వారి కడుపు నింపుతోంది. సంఘం కార్యాలయంలో.. శుభ్రమైన, రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని తయారుచేసి గ్రామంలోని వృద్ధులకు ఇంటికే తీసుకెళ్లి అందజేస్తారు. సుమారు 25 మంది వరకు ఇలా ఆహారాన్ని తింటున్నారు.
క్షత్రియసేవా సంఘం 2007 నుంచి ఈ క్యారేజ్ పద్ధతిని గ్రామంలో అందుబాటులోకి తెచ్చింది. గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్లి ఉంటున్న క్షత్రియులే.. నిర్వహణకు నిధులిస్తున్నారని, ఇతరుల నుంచి విరాళాలు స్వీకరించబోమని సంఘం పర్యవేక్షకుడు శివరామరాజు చెబుతున్నారు. రోజూ వేలల్లో ఖర్చవుతుందని తెలిపారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఏ రోజూ ఆగలేదని.. భవిష్యత్ లోనూ మరింత మందికి ఆహారం అందించేలా కొనసాగిస్తామని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఆమె చదివింది ఎనిమిదే.. కానీ బ్యాంక్ ఛైర్పర్సన్ అయ్యింది..!