పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలో నాలుగు రోజుల కిందట అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడు. యువకుడిపై బాలిక తల్లి చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. గ్రామంలోని కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భయపడిన ఆ యువకుడు సమీపంలోని పామాయిల్ తోటల్లోకి పారిపోయాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు. ఆ వీడియోలో పోలీసులు, కొంతమంది నాయకులు తనను కావాలని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎట్టకేలకు రాత్రి సమయంలో యువకుడు క్షేమంగా ఉన్నట్లు ఫోన్ చేయడంతో అతని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమ కుమారుడిపై కావాలని కొంతమంది వ్యక్తులు పోలీసులకు చెప్పి ఇబ్బందులు పెడుతున్నారని ఆ యువకుడి తల్లి ఆరోపించింది.