విజయనగరంజిల్లా మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వార్డులో 290 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మందికి ఆక్సిజన్తో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఈ రోజు తెల్లవారుజామున మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కల్లోలం రేపింది.
ఆక్సిజన్ అందనందునే మృతి
అయితే..ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో లోపం, అదే సమయంలో చోటుచేసుకున్న కొవిడ్ మరణాలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతిక లోపానికి, మరణాలకు సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆక్సిజన్ లోపమే తమవారిని బలిగొందని మృతుల బంధువులు వాపోతున్నారు. కోలుకొని త్వరలోనే ఇంటికి వెళ్లిపోవచ్చని వైద్యులు చెప్పిన తర్వాత.. ఆకస్మాత్తుగా ఆక్సిజన్ అందనందునే కన్నుమూశారని వారు ఆరోపిస్తున్నారు.
రోజువారీ కరోనా మరణాల్లో భాగంగానే..
కొవిడ్ బాధితుల మృతికి ఆక్సిజన్ సరఫరా లోపం కారణం కాదని జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ చెప్పారు. రోజువారీగా కరోనా మరణాల్లో భాగంగానే ఘటన జరిగిందన్నారు. ఐసొలేషన్ వార్డుకు ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తటం వాస్తవమేనన్న ఆయన..వెంటనే బల్క్ సిలిండర్స్ ఏర్పాటు చేసి అప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దినట్లు వెల్లడించారు. ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవరూ మరణించే పరిస్థితి లేదని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి చెప్పారు. సాంకేతిక సమస్య తలెత్తగానే 15 మందిని తక్షణమే సమీపంలోని తిరుమల ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
సమగ్ర విచారణ జరపాలి
ఆసుపత్రిలో మరణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, విజయనగరం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్ చేసారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలన్నారు.
ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడితే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీచదవండి: విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి