విజయనగరంరాజులు..,పూసపాటి వంశీయుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి. ఉత్తరాంధ్ర ప్రజలు కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి అయిన పైడితల్లి జాతర ఈ ఏడాది ఈ నెల 7న ఆరంభమైంది. నెల రోజుల పాటు జరగనున్న అమ్మవారి జాతరలో తొలేళ్లు, సిరిమానోత్సవం ప్రధాన ఘట్టాలు. ఈ సిరిమాను సంబరం ప్రతి ఏటా దసరా పండుగ ముగిసిన తర్వాత రెండో రోజు క్రమంగా తప్పుకుండా నిర్వహించటం ఆనవాయితీ. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఆలయ సంప్రదాయాల ప్రకారం... నిరాడంబరంగా జరిగింది.
భక్తుల జయజయ ధ్వనాలు, జై పైడిమాంబ శరణు అంటూ వేడుకోలు మధ్య సిరిమాను సంచరించే వీధుల్లో జన సందడి లేకుండానే సిరిమానోత్సవం ముగిసింది. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ..,ఆలయ ఆచార సాంప్రదాయలకు అనుగుణంగా ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించారు. ఎప్పటిలాగే పైడితల్లి అమ్మవారు మూడుసార్లు విజయనగరం పురవీధుల్లో సిరిమాను రూపంలో ఊరేగారు. తన పుట్టినిల్లు విజయనగరం కోట వద్దకు వెళ్లి, రాజ కుటుంబాన్ని ఆశీర్వదించింది.
అమ్మవారి దర్శనానికి వేకువ జాము నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించారు. అనంతరం సర్వదర్శనానికి భక్తులను అనుమతించకపోవటంతో... ఆలయ ప్రాంగణం, భక్తుల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు, ఆలయ ప్రధాన మార్గాలన్నీ బోసిపోయాయి. అమ్మవారిని పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సిరిమానోత్సవం ప్రారంభం వరకూ వేచి ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, రాజవంశీకులు సుధా గజపతి, ఉర్మిళా గజపతి, పలువురు అధికారులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రం సుభిక్షింగా ఉండాలని..,రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరగాలని కరోనా తొలగిపోవాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.
ఇదీచదవండి