విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి మంగళవారం ఆయకట్టులో ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. కొవిడ్ నేపథ్యంలో నాయకులను నీటి విడుదలకు ఆహ్వానించలేదు. జలాశయం డీఈఈ మాధవి ఆధ్వర్యంలో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది కలిసి సంప్రదాయంగా పూజలు చేసి, నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువకు 100 క్యూసెక్కులు, కుడి కాలువకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని ఆయకట్టుకు విడిచిపెట్టారు. మరోవైపు గ్రేటర్ విశాఖపట్నానికి మరో 50 క్యూసెక్కులు తాగునీటి విడుదల కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 114 మీటర్లు కాగా, ప్రస్తుతం 111.50 మీటర్లు ఉంది. జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా వరినాట్లుకు ఉపయోగించుకోవాలని జలవనరుల శాఖ అధికారులు కోరారు.
ఇవీ చదవండి