విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజు కొనసాగుతోంది. తెదేపా నేతలతో పాటు.. కార్మికవర్గాల ప్రతినిధులు సంఘీభావం తెలుపుతున్నారు. వైద్యులు పల్లా శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాసరావుకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంఘీభావం తెలిపారు. ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. లక్షల కోట్లు కొట్టేయాలని కొంతమంది కుట్రపన్నారన్న ఆయన.. గతంలో పోరాటం చేసి ఉక్కు కర్మాగారం సాధించుకున్నామని గుర్తు చేశారు.
చేతగాని నాయకుల తీరుతో మళ్లీ ఉద్యమం చేయాల్సిన దుస్థితి వచ్చిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపా నాయకుల తీరు చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటే సీఎం నోరు మెదపరా అంటూ ప్రశ్నించారు. దిల్లీకి వెళ్లి ఉక్కు కర్మాగారం అంశంపై ప్రధానితో సీఎం మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసమే సీఎం జగన్ దిల్లీ పర్యటనలు అని ఎద్దేవాచేశారు. 2019లో పోక్సో ప్రతినిధులను జగన్ కలిశారో లేదో చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'పోస్కోను రానివ్వం'.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల దీక్షలో నేతలు