కొవిడ్ ప్రభావం(Corona Effect) పలు పరిశ్రమలపై పడటంతో… కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. విశాఖ జిల్లాలో విస్తరాకుల(leaf plates) పరిశ్రమ కూడా ఆర్థికంగా చితికిపోయింది. జిల్లాలోని నర్సీపట్నం డివిజన్లో రావికమతం, రోలుగుంట, బుచ్చయ్యపేట, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, కోటవురట్ల మండలాలతో పాటు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో విస్తర్ల తయారీ పరిశ్రమ కొనసాగుతోంది.
అడవిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఆకులను ఈ ప్రాంతాలకు చెందిన వేలాది మంది మహిళలు విస్తర్లుగా తయారుచేసి.. దుకాణదార్లకు విక్రయిస్తుంటారు వారు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. జిల్లాలో సుమారు 65 వేల మంది కార్మికులు విస్తర్ల(leaf plates) తయారీ పరిశ్రమపై జీవనోపాధి సాగిస్తున్నారు. ఇక్కడ తయారైన విస్తర్లను గ్రేడింగులుగా విభజించి తెలుగు రాష్ట్రాలలోని తిరుపతి , అన్నవరం , విజయవాడ , శ్రీశైలం , భద్రాచలం తదితర పుణ్యక్షేత్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. వీటి తయారీలో రావికమతం మండలం కొత్తకోట దేశంలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారుచేసిన విస్తరాకుల విక్రయాలతో..ఈ ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతుంటాయి.