ప్రకృతి అందాలతో నిండి ఉండే విశాఖను నల్లని ధూళి సమస్య వేధిస్తోంది. నగరంలో ఆహార పదార్ధాల నుంచి... తాగే నీరు వరకు అన్నీ కలుషితమవుతున్నాయి. ఒక్కపుడు కేవలం వన్ టౌన్కు పరిమితమైన ఈ సమస్య.... ఇప్పుడు నగరం పరిధి అంతా విస్తరించింది. ఓడ రేవుల నగరమైనందున దేశ, విదేశాలకు బొగ్గు ఇతర పరిశ్రమలకు కావల్సిన ముడి పదార్ధాలు ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. వీటి వల్ల నగరంలోకి నల్లని దుమ్ము వస్తోంది. ఇక ప్రధానమైన విశాఖ స్టీల్ ప్లాంట్, సింహాద్రి థర్మల్ పవర్ కేంద్రం ఉండడం వల్ల... నౌకలో వచ్చిన బొగ్గు జెట్టిని దిగుమతి చేసి రైల్లో పంపుతారు. ఈ ప్రక్రియ వల్ల పెద్ద ఎత్తున్న ధూళి నగరం పైకి వస్తోంది. విశాఖలో ఏ ఇంటిని చూసిన నల్లని ధూళి కణాలు తాండవిస్తున్నాయి. దీని వల్ల శ్వాస కోశ వ్యాధులు వస్తున్నాయని విశాఖ వాసులు అంటున్నారు.
కారణాలివే...
2010 నుంచి 2018 వరకు చేసిన... గాలి నాణ్యత పరీక్షల ప్రకారం... జ్ఞానాపురం, పోర్ట్ ఏరియాలో గాలిలో 60 శాతం ఉండాల్సిన కాలుష్యం మోతాదు... 100 దాటింది. విశాఖ పోర్ట్ కార్యకలాపాలు, సముద్రం నుంచి వచ్చే పవనాలు, మోటార్ వాహన కాలుష్యం వల్లే నగరంలో ధూళి ఉంటోందని కాలుష్యాన్ని అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
నల్లని ధూళి ఇళ్లలోకి రావడం వల్ల తినే ఆహారపు పదార్ధాలు, నీళ్లు కలుషితమై నగరవాసులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. బయట తిరిగే సమయంలో ముఖానికి మాస్క్ ధరించడం, శుద్ధి చేసిన నీటిని తీసుకోవడం చేస్తే కొంత ఉపశమనం ఉంటుందని సూచిస్తున్నారు.
ముప్పును తగ్గించే మార్గాలివి
విశాఖలో పర్యావరణ హితంగా ఉండే భారత్ స్టాండర్డ్ నాలుగో శ్రేణి వాహనాలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. భవన నిర్మాణాలు చేసేటప్పుడు దుమ్ము బయటకు వెళ్లకుండా చుట్టూ ప్లాస్టిక్ కవర్లను రక్షణగా కట్టాలి. అధునాతన సాంకేతిక పరికరాలు వినియోగించి విశాఖ పోర్ట్ ట్రస్ట్ నుంచి వచ్చే ధూళిని ఎప్పటికపుడు తొలగించాలి. ఈ విధంగా చర్యలు తీసుకుంటే చాలావరకు ఈ ధూళి సమస్య విశాఖను విడిచి పోతుందని నిపుణులు సూచిస్తున్నారు.