Pawan Kalyan Prakasam District Tour: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రకాశం జిల్లా జాగర్లమూడిలో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతు కుటుంబాలను పవన్ కల్యాణ్ కలసి.. చెక్కులు అందిస్తారన్నారు. అనంతరం పర్చూరులో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 80 మంది కుటుంబాలకు పవన్ కల్యాణ్ రూ.లక్ష చొప్పున చెక్కులు అందిస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతుల కుటుంబాలలో ధైర్యం నింపేలా జనసేన పార్టీ చర్యలు చేపట్టిందన్నారు. సంక్షేమం అనే పేరుతో ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేసుకోవడం తప్పా.. రైతులను చేసిందేమీ లేదని విమర్శించారు. రూ.లక్షల కోట్లు తెచ్చిన అప్పులు ఏమయ్యాయని ప్రశ్నించారు. 6,300 కోట్లు రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాల భవనాలు.. వైకాపా కార్యాలయాలుగా మారాయన్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని.. యువత బలంగా నిరసన తెలపాలి.. కానీ ఇలా హింసకు దారి తీసేలా ఉండకూడదన్నారు. యువత ఆందోళన చేస్తున్నప్పుడు.. ప్రభుత్వం దిగి రావాలసిందేనన్నారు.
ఇదీ చదవండి: అగ్నిపథ్పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం