NADU NEDU : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో విడత నాడు-నేడు నిర్మాణ పనుల్లో అలసత్వం విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంటుంది. జిల్లాలో రెండో దశలో 520 ప్రాథమిక పాఠశాలలు, 110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 237 ఉన్నత పాఠశాలలు, 89 అంగన్వాడీ కేంద్రాల్లో పనులు ప్రారంభించారు. అయితే పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణ సామగ్రి సకాలంలో పంపిణీ కాకపోవడంతో తాత్సారం జరుగుతుంది.
సిమెంట్ పంపిణీ చేస్తే, ఇసుక పంపిణీ చేయకపోవడం, లేకపోతే కూలీలు దొరక్కపోవడం.. ఇలా పలు కారణాలతో పనులు ప్రారంభించి రోజులు తరబడి నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. పునాదులకు గోతులు తవ్వి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో ఉర్ధూ పాఠశాలలో అదనపు గది నిర్మాణంలో భాగంగా పునాదులు తవ్వి వదిలేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గోతుల్లో నీరు చేరింది. పాఠశాల పక్కనే ఉన్న ఓ బాలుడు గోతిలో పడి మృతిచెందాడు. బాలుడు చనిపోవడానికి నాలుగు రోజులు ముందే ఇవే గోతుల్లో మరో బాలుడి జారిపడ్డాడు. స్థానికులు అతడిని కాపాడారు. ఇలా అనేక పాఠశాలల్లో గోతులు తీసి వదిలేయడం ప్రమాదకరంగా మారిందని.. స్థానికులు చెబుతున్నారు.
దాదాపు రెండు నెలలక్రితం ప్రారంభమైన పనుల్లో పురోగతి అంతగా కనిపించడంలేదు. ఫలితంగా విద్యార్థులను అంగన్ వాడి కేంద్రాల్లో, ఇళ్లను అద్దెకు తీసుకుని తరగతలు నిర్వహించాల్సి వస్తుంది. కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లో రెండు మూడు అదనపు గదులు మంజూరు చేసిన పాఠశాలలు ఉన్నాయి. భవననిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ఉద్దేశ్యంతో పాఠశాల కమిటీలు పాత భవనాలు తొలగించారు. తీరా వర్క్ ఆర్డర్ వచ్చాక రెండు, మూడు అదనపు గదులకు బదులు ఒకే గదికి అనుమతి వచ్చింది. దీంతో ఆయా పాఠశాలలు వసతి సౌకర్యాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం త్వరితగతిన నిధులు మంజూరు చేసి పనులను వేగంగా పూర్తిచేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: