నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ సమీపాన బ్రిటీషు వారి కాలంలో కాళంగినదిపై నిర్మించిన వంతెన ప్రస్తుతం శిథిలదశకు చేరింది. రోజూ ఈ వంతెన మీదుగా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వంతెన ప్రమాదకరంగా ఉందని గత కొన్నేళ్లుగా స్థానికులు, పాలకులు, ర.భ.శాఖ ఇంజినీర్లు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. వంతెన ఆధునికీకరణకు ప్రభుత్వం నుంచి పైసా కూడ మంజూరు కావడం లేదు. గతంలో వంతెన జాతీయ రహదారులు (ఎన్హెచ్) పరిధిలో ఉండేది. ఆ సమయంలో వంతెన ఓ వైపున కూలిపోయింది. అప్పట్లో రాకపోకలు కొన్ని నెలలపాటు నిలిచిపోయాయి. ఆ తర్వాత మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించారు.
ప్రస్తుతం వంతెన కింది భాగంలో పలుచోట్ల పగుళ్లుబారాయి. ఈ వంతెన స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరొక దాని నిర్మాణం కోసం పదేళ్ల కిందట ర.భ.శాఖ ఇంజినీర్లు రూ.19 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు మాత్రం నేటికీ మంజూరు కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి, జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూళ్లూరుపేట పర్యటన సందర్భంగా వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అయినా కదలిక లేదు. 2016లో సూళ్లూరుపేటకు విచ్చేసిన అప్పటి రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు కాళంగి నదిపై వంతెన నిర్మాణానికి 15 రోజుల్లో నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఆయన నిధులను రాల్చలేదు. అలాగే 2017లో పక్షుల పండగకు అప్పటి ముఖ్యమంత్రి తరపున సూళ్లూరుపేటకు విచ్చేసిన అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు కాళంగి నదిపై వంతెనకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఫైళ్లలో కదలికలేదు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వ హయాంలోనైనా శిథిల వంతెనకు మోక్షం వస్తుందో.. రాదో వేచి చూడాల్సిందే
ఇవీ చదవండి