కర్నూలు జిల్లా ఆదోని పురపాలక ఎన్నికల్లో 13వ వార్డు తెదేపా అభ్యర్థి షంషాద్ బేగం గెలిచినా.. వైకాపా నాయకుల ప్రోద్బలంతో ఓటమిగా చిత్రీకరించారని ఆమె భర్త తెదేపా నాయకుడు మహబూబ్బాషా ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి తనయుడు జయమనోజ్రెడ్డి, వైకాపా నాయకులు చంద్రకాంత్రెడ్డి, మహేంద్రరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి తదితరులు కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చారని తెలిపారు. డిక్లరేషన్ ఫారం తీసుకొని వైకాపా అభ్యర్థి గెలిచినట్లు కంప్యూటర్లో నమోదు చేయించి అధికారుల చేత వైకాపా అభ్యర్థికి డిక్లరేషన్ ఫారం ఇప్పించారని ఆయన ఆరోపించారు.
రీకౌంటింగ్ చేయాలని బైఠాయించిన తమను పోలీసుల చేత బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లారని, ఆదోని ఎమ్మెల్యేకి నీతి నిజాయతీ ఉంటే 13వ వార్డుకు రీకౌంటింగ్ నిర్వహించేలా చూడాలని కోరారు. తనకు జరిగిన అన్యాయంపై తెదేపా అధిష్ఠానంతో మాట్లాడి కోర్టును ఆశ్రయిస్తానని ఆయన పేర్కొన్నారు.