కొందరు కూలీలు నడకతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. దారిలో ఏదైనా వాహనాలు వస్తే వాటిలో వెళుతూ కొన్ని చోట్ల నడుస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. కొన్నిసార్లు పోలీసులు అడ్డుకుని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తరలిస్తున్నారు. ఇలా వచ్చే క్రమంలో సరైన ఆహారం లేక అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు కొందరు కూలీలు అనారోగ్యానికి గురై సకాలంలో వైద్యం అందక మృతిచెందుతున్నారు. పనుల కోసం వచ్చి అనారోగ్యంతో అసువులు బాసి అయిన వారికి అంతులేని ఆవేదనను కలిగిస్తున్నారు. వలసకూలీలు సొంతూళ్లకు పంపాలని పదేపదే అధికారులను వేడుకుంటున్నారు.
గుంటూరు జిల్లాలో మిర్చి కోతలకు కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల నుంచి సుమారు 30వేల మంది కూలీలు వచ్చారు. వీరు జనవరిలో వచ్చి మార్చి నెలాఖరు వరకు మిర్చి కోతల పనులు చేసుకుని సొంతూళ్లకు వెళతారు. వీరు ఇళ్లకు పయనమయ్యే సమయానికి లాక్డౌన్ అమలులోకి రావడంతో ఇక్కడే ఉండిపోయారు. మిర్చి కోతలు చివరికి రావడంతో పనులు లేక తాత్కాలిక గుడారాల్లోనే నివసిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు సొంతూళ్లో ఉండి పోవడంతో వారి పరిస్థితి ఎలాగుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరకులు, కూరగాయలు పంపిణీ చేయడానికి అధికారులు, దాతలు వచ్చినప్పుడు సొంతూళ్లకు పంపించాలని కాళ్లా వేళ్లా పడుతున్నారు. పెదకూరపాడు మండలానికి కర్నూలు జిల్లా నుంచి 6800 మంది కూలీలు వచ్చారు. వీరిని పంపడానికి ఇక్కడి యంత్రాంగం సిద్ధమైనా అంతమందిని పంపలేమని అక్కడి యంత్రాంగం చెప్పడంతో ఆగిపోయారు. కొందరు కాలినడకన వెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు గుర్తించి వెనక్కి తీసుకువచ్చారు.
రాలిపోతున్న ప్రాణాలు
గుంటూరు జిల్లా
సత్తెనపల్లి మండలం కంటెపూడికి చెందిన 30 కుటుంబాల వారు పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో పొగాకు బ్యారెన్ పనులకు వెళ్లారు. వీరంతా ఈనెల 17న అక్కడి నుంచి ఒక లారీలో కంటెపూడి సమీపం వరకు ప్రయాణించారు. కంటెపూడి సమీపంలో పోలీసు చెక్పోస్టు ఉండటంతో కొంతదూరం ముందు లారీ దిగి పొలాల గుండా గ్రామానికి నడుకుచుకుని వెళ్లే క్రమంలో వెదుళ్లపల్లి వెంకటేశ్వర్లు(65) పొలంలో హద్దురాయి తగిలి కింద పడిపోయారు. సత్తెనపల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతిచెందారు.
ప్రకాశం జిల్లా
కొనకనమిట్ల మండలం పెదరికట్ల గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అక్కిదాసరి చినకాసయ్య(41) హైదరాబాద్లో తాపీ పనులు చేసేవారు. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడి నుంచి సొంతూరికి వెళ్లాలని బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గుంటూరు జిల్లా పొందుగల వద్దకు చేరుకున్న ఆయన పోలీసు చెక్పోస్టు ఉండడంతో కృష్ణానది గుండా ఏపీ వైపు రావడానికి ప్రయత్నం చేశారు. ఈక్రమంలో నదినీటిలో పడి మృతిచెందారు. స్థానికులు గుర్తించడంతో పోలీసులు మృతదేహాన్ని ఈనెల 18న బయటికి తీసి గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. మరుసటి రోజు ప్రకాశం జిల్లా నుంచి మృతుని బంధువులు వచ్చి గుర్తుపట్టి తీసుకెళ్లారు.
మార్గ మధ్యలో ప్రాణాలొదిలి..
దేవరకొండ మండలం నేలతలమర్రి గ్రామానికి చెందిన 25 కుటుంబాలు కూలీ పనులకు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లికి వలస వచ్చాయి. ఇందులో బోయ రంగన్న(45) పక్షవాతంతో బాధపడుతూ కడపలో మందులు తీసుకుంటున్నారు. రెండు వారాల కిందట మందులు అయిపోయినా లాక్డౌన్ నేపథ్యంలో వెళ్లలేకపోయారు. వీరంతా వాహనంలో సొంతూరికి బయలుదేరగా బొల్లాపల్లి చెక్పోస్టు వద్ద ఈనెల 17న పోలీసులు అడ్డుకున్నారు. అస్వస్థతతో ఉన్న రంగన్నను వినుకొండ అసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. అక్కడి వైద్యులు గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో గుంటూరుకు వెళుతుండగా మార్గమధ్యలో మరణించారు. పోలీసుల అనుమతితో కర్నూలుకు వెళ్లి అంత్యక్రియలు చేశారు.
కర్నూలు జిల్లా
ఆలూరు మండలం ములగపల్లికి చెందిన మహేశ్వరి(22) తన కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టావారిపాలెం గ్రామానికి ఫిబ్రవరి నెలలో మిర్చికోతలకు వచ్చారు. ఈనెల 19వతేదీ రాత్రి మహేశ్వరి ఫిట్స్తో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో ఉండగానే చనిపోయింది. పోలీసుల అనుమతితో సొంతూరికి వెళ్లి అంత్యక్రియలు చేసుకున్నారు.
ఇవీ చూడండి