Garividi Veterinary College: చదువు పూర్తవుతుందంటే విద్యార్థులెవరైనా ఎగిరి గంతేస్తారు. మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడొచ్చని ఆనందపడతారు. కానీ మూడేళ్లు కష్టపడి చదవి మరో 10 రోజుల్లో కోర్సు పూర్తవుతున్న విజయనగరం జిల్లా గరివిడి పశువైద్య కళాశాల విద్యార్థులకు మాత్రం ఏం పాలుపోవడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల తాము కష్టపడి చదివిన చదువు అక్కరకు రాదని తెలిసి విద్యార్థులు ఆందోళనబాట పట్టారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వాకం పశు వైద్య విద్యార్థులకు శాపంగా మారింది. 327 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. ఎలాంటి అనుమతులు లేకుండానే కోర్సులు ప్రారంభించి విద్యార్థుల జీవితాలతో గత ప్రభుత్వం ఆటలాడుకుంది. విజయనగరం జిల్లా గరివిడి పశువైద్య కళాశాలను గత ప్రభుత్వం హయాంలో 2021లో ప్రారంభించారు. మూడు, నాలుగేళ్ల కోర్సులు ఇక్కడ ప్రారంభించారు. అయితే భారత పశువైద్య విద్యామండలి అనుమతులు తీసుకోకుండానే ప్రారంభించిన ఈ కోర్సులు ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. మరో పది రోజుల్లో చదవులు పూర్తవుతున్నా ఇప్పటికీ ఈ కళాశాలకు, కోర్సులకు అనుమతులు లభించలేదు.
జాతీయ పశువైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా కాలేజీలో బోధనా సిబ్బంది. సౌకర్యాలను, అధికారులకు కల్పించలేకపోవడంతో కళాశాలలో 2023, 2024 సంవత్సరాల్లో బోధనకు వీసీఐ అనుమతులు నిరాకరించినప్పటికీ బోధన కొనసాగిస్తూ వస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులకు ఈ ఏడాది మార్చితో వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి కానుంది. ఇప్పటికీ తాము చదువుతున్న చదువుకు గుర్తింపు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో 10 రోజులుగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు.
ఉత్తరాంధ్ర యువతకు నాణ్యమైన చదువుతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో 2016లో తెలుగుదేశం ప్రభుత్వం గరివిడిలో పశువైద్య కళాశాల నిర్మాణం చేపట్టింది. కళాశాల ప్రధాన భవనం, వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్, విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా రెండు వసతి గృహలు నిర్మాణం పూర్తి చేసింది. 2019లో అధికారంలోకి వచిన వైఎస్సార్సీపీ విద్యాబోధనకు అవసరమైన ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండానే కళాశాల ప్రారంభించింది. ఆ తర్వాత కూడా పట్టించుకోకపోవడంతో 2023, 2024 సంవత్సరాల్లో బోధనకు వీసీఐ అనుమతులు నిరాకరించింది.
దీన్ని లెక్కచేయకుండా అధికారులు బోధన కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు కోర్సు పూర్తవుతుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చదివిన చదువుకు గుర్తింపు రాకపోతే తమకు భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. చదువు పూర్తయ్యాక ఇంటర్నెషిప్ చేయాలన్నా, పీజీ చేయాలన్నా, ఏదైనా కొలువులో చేరాలన్నా వీసీఐ గుర్తింపుతో కూడిన సర్టిఫికెట్ అవసరం. అధికారులు ఇప్పటికైనా వీసీఐతో చర్చించి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని డీన్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం వీసీఐతో చర్చించి గుర్తింపు తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
"విద్యార్థులు మరికొద్ది నెలల్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రాంకి వెళ్లాల్సి ఉంది కాబట్టి, కళాశాల గుర్తింపు కోసం సమ్మె జరుగుతోంది. దీనిపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేయడం, అదే విధంగా దీనికి సంబంధించిన చర్యలు అన్నీ తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ సమస్యను అధిగమించొచ్చు". - మక్కెన శ్రీను, అసోసియేట్ డీన్
పశు చికిత్సా భవనంలో బోధన - వైఎస్సార్సీపీ సర్కార్ నిర్వాకంతో ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్తు