బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకెళ్లే రైతులనే లక్ష్యంగా చేసుకున్న దారి దోపిడీ దొంగలకు ఆళ్లగడ్డ పోలీసులు చెక్ పెట్టారు. ఇద్దర్ని అరెస్ట్ చేసి 12 లక్షల 68 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర, రంగస్వామి ఈ దారి దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకొని వెళ్లే రైతులను అనుసరిస్తూ అళ్లగడ్డ పట్టణం దాటిన తర్వాత వాహనాలతో ఢీకొట్టి కత్తులతో బెదిరించి సొమ్ము ఎత్తుకెళ్లిపోయేవారు. గత ఐదు నెలల కాలంలో నలుగురు రైతుల నుంచి నగదు ఎత్తుకెళ్లిపోయారు. ఈనెల 12వ తేదీన ఆళ్లగడ్డ శివార్లలో పేరాయిపల్లి గ్రామానికి చెందిన రామగోపాల్ రెడ్డి అనే రైతు నుంచి డబ్బులు దోచుకునేందుకు యత్నించిన ఇద్దరినీ సీఐ నరేష్ బాబు, ఎస్సై సుధాకర్ రెడ్డి వెంబడించి పట్టుకున్నారు. 5 కిలోమీటర్ల పాటు వెంబడించి
ఈ చోరులను అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, 2 కత్తులు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు ఉన్నతాధికారులు సన్మానించారు.
ఇవీచదవండి