కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుంచి మోపిదేవి వరకు 216 జాతీయ రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. సుమారు రూ.227 కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టింది. రోడ్డు నిర్మాణ బాధ్యతలను ఆర్వీఆర్ సిఐపిఎల్(జేవీ) దక్కించుకుంది. ఇప్పటికే పనులను 80 శాతం వరకు పూర్తి చేసింది. ఈ క్రమంలో మోపిదేవి పరిధిలోని మత్స్యకారుల విద్యార్థుల కోసం నిర్మించిన పాఠశాల వద్ద టోల్గేట్ను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం కొంతమేర పాఠశాల స్థలాన్ని సేకరించే పనిలో పడింది. ఈ చర్యను.. స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్తులో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
700 మంది విద్యార్థులు...
టోల్గేట్ నిర్మించాలని భావిస్తున్న ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, మత్స్యకారుల బాలుర ఆశ్రమ పాఠశాల ఉంది. వీటితో పాటు మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలతో పాటు జూనియర్ కాలేజ్ ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇలాంటి ప్రాంతంలో టోల్గేట్ నిర్మిస్తే వాయు కాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందారు. అధికారులు మార్కింగ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. టోల్గేట్ నిర్మాణం విద్యార్థుల చదువుకు అటంకంగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదల భూములు కూడా...!
30 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం స్థానిక పేదలకు భూములను పంపిణీ చేసింది. అయితే వీటిలో కొంతమేర టోల్గేట్ నిర్మాణం కోసం అధికారులు మార్కింగ్ చేపట్టారు. అయితే తమ భూములను ఎట్టిపరిస్థితుల్లో ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ జె. మాధవిలతకు వినతి పత్రం ఇచ్చారు. టోల్గేట్ నిర్మాణాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు.
ఇదీ చదవండి: