గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులంతా కొత్తగా మండల స్థాయిలో ఉద్యోగ సంఘాలను ఎన్నుకుంటున్నారు. సహచర ఉద్యోగులు తమ మాట వినడం లేదని అంటున్న సంఘాల నాయకులను తమ సమావేశానికి ఇకనుంచి ఆహ్వానించేది లేదని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సచివాలయాల ఉద్యోగులతో మండల సంఘాల ఏర్పాటు అవుతుండడం విశేషం.
అత్యధిక జిల్లాల్లో ఇప్పటికే మండల సంఘాలు ఏర్పడ్డాయి. దీంతో.. ప్రస్తుత సంఘాలకు చెక్ పెట్టే క్రమంలో వీటిని తెరపైకి తెస్తున్నారా? అనేది చర్చనీయాంశమవుతోంది. ప్రొబేషన్ ఖరారుకు ఉద్యోగులు ఇటీవల ఆందోళన చేశారు. వారితో చర్చించేందుకు అజయ్జైన్ నిర్వహించిన సమావేశానికి సచివాలయాల ఉద్యోగుల సంఘాల తరఫున 20 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు.
ఆందోళన వీడాలని ఉన్నతాధికారి సూచించినప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు కొందరు విభేదించారు. సమస్యలు పరిష్కరించేవరకు సహచరులు మాట వినే పరిస్థితుల్లో లేరని వారు పేర్కొనడంపై అజయ్జైన్ ఆగ్రహించారు. ఈ సమావేశం ముగిసిన 10రోజుల్లో మండలస్థాయిలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటుకావడం చర్చకు దారి తీస్తోంది.
ఇదీ చదవండి:
PRC ORDERS: ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్.. డిమాండ్లు బేఖాతరు!