ఉద్యోగాల కోసం గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరాశకు గురి చేసిందని ప్రజాస్వామ్య యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జి. రామన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాలు లేని క్యాలెండర్ తమకు అవసరం లేదని, ఉద్యోగాలు ఉన్న క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రభుత్వం గతంలో చెప్పిన విధంగా 24 శాఖల్లో 1.83 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
పోలీసు శాఖలో 16 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, హోం శాఖ మంత్రి ప్రకటనలు చేశారు. కానీ 200 ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. గ్రూప్ 1, 2 ఉద్యోగాలు ఐదువేలకు పైగా ఉన్నాయని.. తమ ప్రభుత్వం వస్తే భర్తీ చేస్తుందని ప్రకటనలు చేసారని కానీ 36 పోస్టులు గ్రూప్-2 ద్వారా భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. జాబ్ క్యాలెండర్లో డీఎస్సీ ఊసే లేదన్నారు. వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల క్యాలెండరు నిరుద్యోగులను నిరాశకు గురి చేసిందన్నారు.