కరోనాకు కాదేదీ అనర్హం.. పరిశ్రమల నుంచి ఉద్యోగుల వరకు.. కూలి నుంచి కార్మికుడి వరకు ఎవ్వరినీ వదల్లేదు. అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. దీని ప్రభావం కృష్ణా జిల్లాలో అన్ని రంగాలపైనా పడింది. ఉద్యాన, ఆహార పంట ఉత్పత్తులను అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. జీడి పరిశ్రమపైనా కరోనా పిడుగు పడింది.
ముమ్మరంగా వ్యాపారం జరగాల్సిన సమయంలో కోలుకోని దెబ్బతీసింది. పప్పు తయారీ యూనిట్ల సైతం కరోనా ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరితోపాటు విదేశాల నుంచి జీడిపిక్కలను దిగుమతి చేసుకుని కృష్ణా జిల్లాలో జీడిపప్పు తయారీ యూనిట్లు చిన్నతరహా పరిశ్రమలుగా కొనసాగుతున్నాయి. కరోనా ప్రభావం కొత్త యూనిట్లపై చూపుతోంది.
ఇది జీడి పంట కాలం. ఈ సమయంలోనే ఏడాదికి సరిపడా ముడిసరకును పరిశ్రమ యజమానులు కొనుగోలు చేస్తుంటారు. లాక్డౌన్ కారణంగా రవాణా సదుపాయం అంతంతగా ఉండడంతో జీడిపిక్కలు కొనుగోలుకు సమస్య ఎదురవుతోంది. సీజను దాటిపోతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఖర్చు పెరిగిపోతుంది. పశ్చిమగోదావరితోపాటు విదేశాల నుంచి కూడా జీడిపిక్కలను దిగుమతి చేసుకుని పప్పు తయారు చేస్తున్నారు.
కరోనా వేళ ఉపాధి పొందటం సంతోషం
పిక్క నుంచి పప్పు వేరైన తర్వాత సైజుల వారీగా గ్రేడింగ్ చేసే పనిలో మహిళలు ఉపాధి పొందుతున్నారు. కరోనా కారణంగా చదువులు లేకపోవడంతో విద్యార్ధినులు... తమ కుటుంబ ఆసరా కోసం ఈ పనిలో కుదురుకున్నారు. పరిశ్రమ నిర్వాహకులు శిక్షణ ఇవ్వడంతో పాటు.. కరోనా వైరస్ ప్రభావం పరిశ్రమల్లోకి రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు. కరోనా సమయంలో స్థానికంగా ఆహార పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉపాధి పొందుతుండడం తమకు సంతోషంగా ఉందని కార్మికులు తెలిపారు.
జీడీ ఉపయోగాలు
ప్రకృతి ప్రసాదించిన ప్రతి పదార్థం ఆరోగ్య ప్రదాతే. జీడిపప్పు కూడా అదే కోవలోకి వస్తుంది. చాలా మంది అధిక కేలరీలు ఉండే కాజూ తింటే ఒళ్లు వచ్చేస్తుందని భయపెడుతుంటారు. కానీ, జీడిపప్పు చేసే మేలు గురించి చెబితే ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిందే. శరీరానికి అన్ని రకాల పోషక విలువలు కావాలి. జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో డ్రైఫ్రూట్స్లో జీడిపప్పును ఓ భాగంగా చేర్చి అందిస్తున్నారు.
ఇవీ చదవండి:
స్వాతంత్య్ర దినోత్సవాల్లో కొవిడ్ వారియర్స్... ప్రత్యేక ఆహ్వానంతో గౌరవించిన ప్రభుత్వం