‘నవరత్నాలు-పేదలందలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపట్టిన గృహనిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. విశాఖలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరగాలని సీఎం ఆదేశించగా.. అక్కడ 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను అక్టోబరు చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆప్షన్-3 కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలు కూడా వేగంగా సాగుతున్నట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణంతో సమాంతరంగా కాలనీల్లో మౌలిక సదుపాయాలపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పనుల ప్రగతి సమీక్షించడానికి, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. ప్రత్యేకంగా ఒక ఫోన్ నంబర్ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు.
టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలన్న సీఎం.. వీటి నిర్వహణ బాగుండేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. 15 నుంచి 20 రోజుల్లో 1.4 లక్షల ఇళ్లు సిద్ధం అవుతాయని అధికారులు తెలియజేశారు. త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. 90రోజుల్లో ఇంటి పట్టాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 కొత్తవిగా తేల్చామని అధికారులు తెలిపారు. వీరిలో ఇప్పటికే లక్షమందికి పట్టాలు అందించామని.. మిగతా వారికీ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు. పట్టా ఇవ్వడమే కాకుండా, లబ్ధిదారుని స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలని సీఎం ఆదేశించారు.
ఇవీ చదవండి: గృహ నిర్మాణ పనులు శరవేగంగా జరగాలి: సీఎం జగన్