Alligations on government lands: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతంలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూములను.. వైకాపా నాయకులు బినామీ పేర్లతో దస్త్రాలు మార్చేయడంతో పాటు.. వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.200 కోట్ల రుణాలు తీసుకున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల సమీపంలో 150 ఎకరాల ప్రభుత్వ భూములు, మాచవరం మండలంలోని తాండుట్ల, పిల్లుట్ల, మోర్జంపాడు, పిన్నెల్లి, చెన్నాయిపాలెం గ్రామాల్లో సుమారు 600 ఎకరాలకు దస్త్రాలు మార్చేసినట్లు ఆరోపించారు. మాచవరం మండలంలో జరిగిన భూ ఆక్రమణలపై పత్రికల్లో కథనాలు వచ్చాక జిల్లా కలెక్టరు విచారణ చేయించినప్పటికీ.. నివేదికను బుట్టదాఖలు చేశారని విమర్శించారు.
‘దాచేపల్లి మండలంలోని పొందుగలలో 150 ఎకరాలు, తక్కెళ్లపాడులో 100, తంగెడలో 100, నడికూడి, దాచేపల్లి, గామాలపాడు గ్రామాల్లో 500 ఎకరాలకు రికార్డులు మార్చారు. తంగెడ ఉన్నత పాఠశాలను తనాఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. గురజాల మండలంలో దైద, మాడుగుల, పల్లెగుంత గ్రామాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. గురజాల నుంచి పల్లెగుంతకు వెళ్లే దారిలో పది ఎకరాలు ప్రభుత్వ భూమిని వైకాపా నాయకుల పేరిట మార్చారు. సర్వే నెంబర్లు మార్చిన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. ఇంత పెద్దఎత్తున అక్రమాలు జరిగితే, స్థానిక ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి ఎందుకు స్పందించడం లేదు?’ అని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
అప్పుల ఊబిలో కూరుకుపోతోన్న రాష్ట్రం... రుణ భారం 7.76 లక్షల కోట్లు?