పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిన ప్రాంతంలో స్టాప్ లాక్ ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. జలాశయంలో ఉన్న నీటిని దిగువకు వదిలి నీటిమట్టాన్ని తగ్గించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి లక్షా 67 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. 19 గేట్లు ఎత్తి 4లక్షల 95వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరమ్మతు పనులు ప్రారంభించాలంటే మరో 10 టీఎంసీలు ఖాళీ చేయాల్సి ఉంది. మధ్యాహ్నం వరకూ 10 టీఎంసీలు దిగువకు విడుదల చేయోచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్టాప్ లాక్ ఏర్పాటుకు సంబంధించి నిపుణుల బృందం పులిచింతల ప్రాజెక్టుకు చేరుకుంది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు అవరసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టాప్ లాక్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఆలస్యం కానున్న స్టాప్ లాక్ ఏర్పాటు ప్రక్రియ...
పులిచింతల ప్రాజెక్ట్ లో విరిగిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాక్ ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు వస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీరు 10 టీఎంసీలకు తగ్గిన తర్వాత మాత్రమే స్టాప్ లాక్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడం సాధ్యమవుతుంది. దీని కోసం ఇంజినీరింగ్ నిపుణులు సిద్ధంగా ఉన్నారు. స్టాప్ లాక్ గేటుకు అవసరమైన ఇనుప సెగ్మెంట్లను సిద్ధం చేస్తున్నారు. జలాశయంలో అనువైన పరిస్థితి రాగానే పనులు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం పులిచింతల 17 గేట్ల నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి లక్షా 12వేల క్యూసెక్కుల నీరు పులిచింతల జలాశయానికి వస్తోంది. వరద ఎంత త్వరగా తగ్గితే అంత త్వరగా పనులు మొదలు పెడతామని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రకాశం బ్యారేజికి భారీగా వరద.. కొనసాగుతున్న ప్రమాద హెచ్చరిక