సంక్రాంతి పండగను పురస్కరించుకుని నిర్వహించే కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతామని ఒకవైపు యంత్రాంగం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఏర్పాట్లు ఆగలేదు. ముగ్గుల పోటీలో ఇంకేవో సంప్రదాయ క్రీడలు నిర్వహిస్తామనిపైకి చెబుతున్నా రాత్రికి రాత్రే జేసీబీ యంత్రాలతో బరులు సిద్ధం చేయడానికి కొందరు నేతలు అవసరమైన సామగ్రి ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. గతేడాది రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో బహిరంగంగానే కోడిపందేలు నిర్వహించారు. ఈసారి కూడా ఆ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నగరంలో పది రోజుల క్రితమే బరులు తయారీకి వాటి నిర్వాహకులు తెరదీశారు. దీంతో గ్రామీణ ఎస్పీ విశాల్గున్నీ స్పందించి వాటిని అడ్డుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. బరులు తయారయ్యే వరకు పోలీసులు కన్నెత్తి చూడలేదని నగరం ఎస్సై, రేపల్లె రూరల్ సీఐలకు మెమోలు ఇచ్చి ఝలక్ ఇచ్చారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాటి నిర్వహణకు తావు లేదని గ్రామీణ, అర్బన్ ఎస్పీలు, జిల్లా పాలనాధికారి ముగ్గురూ ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఇంత విస్పష్టంగా చెప్పాక కూడా కొన్ని ప్రాంతాల్లో గుంభనంగా బరులు ఏర్పాటు దిశగా సన్నాహాలు ఊపందుకున్నాయి.
అధికార పార్టీ ప్రతినిధే బరులు తయారు చేయిస్తూ...
ప్రధానంగా డెల్టా ప్రాంతంలో లంకల్లో పందేల నిర్వహణకు కొందరు నేతలు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లాలో రేపల్లె, వేమూరు, తెనాలి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఈసారి కోడిపందేలు జరగడానికి ఆస్కారం ఉందనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు ఏకంగా తన పొలంలోనే మూడు బరులు సిద్ధం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ బరులవైపు వెళితే ఆ ప్రజాప్రతినిధి తనను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటారోనని ఏకంగా ఓ పోలీసు అధికారి సెలవులో వెళ్లిపోయారని సమాచారం. మరో ప్రజాప్రతినిధి కూడా ముగ్గుల పోటీలకు సన్నాహాలు చేస్తూనే కోడి పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేయాలని సూచించారని ఆ ప్రజాప్రతినిధి వద్ద ఉండే అనుయాయులు కొందరు అంటున్నారు. వేమూరు నియోజకవర్గంలో పల్లెకోన తదితర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆటవిడుపు కోసం ఆయా బరుల వద్దకు విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల నుంచి జెయింట్ వీల్స్ వంటివి రప్పిస్తున్నారని తెలిసింది. అన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన ద్వితియ శ్రేణి నాయకులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయలేక.. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోలేక పోలీసులు సతమతమవుతున్నారు.
నోటీసులు జారీ చేస్తూ...
ఇప్పటికే జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్పీలు కింది స్థాయి పోలీసు యంత్రాంగంతో గతంలో ఎవరైతే కోడిపందేలు నిర్వహించారో వారందరికి నోటీసులు పంపి ఈసారి వాటి నిర్వహణలో పాలు పంచుకోవద్దని కోరుతున్నారు. కోళ్లకు కత్తులు కట్టేవారిని గుర్తించి వారికి నోటీసులు పంపే పనిలో పోలీసులు ఉన్నారు. చివరకు బరుల ఏర్పాటుకు గతంలో భూములు ఇచ్చిన రైతులను అప్రమత్తం చేస్తూ తాకీదులు పంపారు. ఎవరైనా కత్తి కట్టినా.. పందెం నిర్వహణకు ఏర్పాట్లు చేసినా, బరులకు భూములు ఇచ్చినా ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని గ్రామీణ ఎస్పీ విశాల్గున్నీ చెప్పారు. రేపల్లె, పెదకూరపాడు నియోజకవర్గాల్లో బరులు సిద్ధం చేయడానికి సన్నాహాలు జరిగితే వాటిని నిలుపుదల చేయించామన్నారు. ఇప్పటివరకు గ్రామీణ జిల్లాలో కోడి పందెం నిర్వాహకులు, కత్తులు కట్టేవారు, భూములిచ్చేవారిని గుర్తించి 50 మందికి పైగా నోటీసులు పంపారు. షామియానాలు, మైకుల నిర్వాహకులకు బరుల వద్దకు ఎలాంటి సామగ్రి సరఫరా చేయవద్దని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్నతాధికారులు కఠినంగానే ఉన్నా పండగ వేళ ఏ మేరకు వాటిని కట్టడి చేస్తారో వేచిచూడాలి.
ఇదీ చదవండి: గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్