పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల భూసేకరణ.. వివాదాలకు దారి తీస్తోంది. పెనుగొండ మండలం దేవా గ్రామ పరిధిలోని వంగ తాళ్ల చెరువులో స్థానికులు, రైతులు ఆందోళనకు దిగారు. మంచినీటి చెరువును పూడిక చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పలువురు మహిళలు పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని ధర్నాకు దిగారు. ఇదే నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతంలో పంట పొలాలు పూడ్చేందుకు అధికారులు రహదారి నిర్మాణం చేపట్టడాన్ని రైతులు అడ్డుకున్నారు.
ప్లాట్లు తీసుకుంటే ప్రాణాలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లవారి పాలెం వాసులు అధికారులను హెచ్చరించారు. 40 ఏళ్ల క్రితం 130 మందికి ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ప్లాటు ఇచ్చారని... కొద్దిరోజులుగా వాటిని వేరే వారికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందారు.
కృష్ణా జిల్లాలో తెదేపా నేత తంగిరాల సౌమ్య.. లబ్ధిదారులను కలిశారు. వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామంలో మాట్లాడిన ఆమె పేదల భూములను, స్థలాలను అధికారాన్ని ఉపయోగించి లాక్కోవాలనుకోవడం అన్యాయమని దుయ్యబట్టారు.
ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిలో రోడ్డు వేయొద్దంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంట రోడ్డుకు అడ్డంగా బండ రాళ్ళు వేసి పనులను అడ్డుకున్నారు. మండల పరిధిలోని మనమీద పల్లి రహదారి నుంచి తూపల్లె రోడ్డు మార్గంలో పనులు మంజూరయ్యాయి. ఈ మార్గంలోని భూమిని ప్రభుత్వం గతంలో నాయీబ్రాహ్మణులు, మౌజన్ల కు కేటాయించింది. వారంతా పనులను అడ్డుకున్నారు.
ఇదీ చూడండి: