MP Kanakamedala Letter on NTR Health University: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్కు తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర లేఖ రాశారు. ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయడానికి, ఆయనను అవమానించేందుకే యూనివర్శిటీకి పేరు మార్పు చేశారని మండిపడ్డారు. పేదలకు మెరగైన వైద్య సేవలు అందించేందుకు దేశంలోనే ప్రప్రథమంగా 1986లో అన్ని మెడికల్ కాలేజీలను ఎన్టీఆర్ యూనివర్శిటీ కిందకు తీసుకొచ్చారని తెలిపారు. నాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో వైద్యరంగంలో అనేక మార్పులు చోటుచేసుకోవడమే కాకుండా వైద్య విద్యార్ధులకు, పేదవర్గాలకు ఎంతగానే ఉపయోగపడిందని లేఖలో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో చదివిన వేల మంది విద్యార్థులు దేశ, విదేశాలలో అనేక కీలక పదవులలో స్థిరపడ్డారని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. గత మూడున్నర సంవత్సరాలు ఈ పేరు మరింత ఇనుమడించిందని, ఇంతలోనే ఎన్టీఆర్ హల్త్ యూనివర్శిటీ పేరును డా.వై.ఎస్.ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్పు చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోందని కనకమేడల ఆవేదన వ్యక్తంచేశారు. పేరు మార్పుకు వైకాపా ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. పేరు మార్పుపై పూర్వ విధ్యార్ధులకు గానీ, ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ గానీ చేయలేదన్నారు.
పేరు మార్పుతో గత నాలుగు దశాబ్దాలుగా నిర్మించుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే కాకుండా దేశ విదేశాలలో వైద్య విద్యార్ధులు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఎంపీ లేఖలో స్పష్టంచేశారు. ఒక విద్యాసంస్థ బ్రాండ్ ఇమేజ్ ను బట్టి ఆ విధ్యార్ధుల భవిష్యత్తు ఎంతగానో ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశ విదేశాలలో ఎన్టీఆర్ అన్న పేరు ప్రతీ తెలుగువాడి, ప్రతీ భారతీయుడి హృదయాలను టచ్ చేసే పేరని ఎంపీ గుర్తుచేశారు. గొప్ప మహోన్నతమైన పేరు మార్పు చేయడాన్ని ఊహించుకోలేకున్నమన్నారు. దీనిపై తమరు జోక్యం చేసుకుని పేరు మార్పును నిలుపుదల చేసి సంస్థ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడలని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్కు లేఖ ద్వారా విజ్ఙప్తిచేశారు.
ఇవీ చదవండి: