కరోనా వ్యాప్తిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నరసరావుపేట అధికారులు సూచించారు. వినుకొండలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. కరోనా సోకిన వారిని క్వారంటైన్ కు తరలించి ఆ ప్రాంతాన్ని శానిటైజర్ చేసి తగుజాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. పుర ప్రజలు సాధ్యమైనంత వరకూ ఇంటికి పరిమితం కావాలని కోరారు.
తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే మాస్కు తప్పనిసరిగా ధరించి, శానిటైజర్ వాడుతూ భౌతికదూరం పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వినుకొండ వ్యాపారస్తులు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. లేనిచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వినుకొండ పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీకి కావలసినంత భూమి దొరక్కపోవడంతో అన్ని రకాలుగా పరిశీలించి 110 ఎకరాలు ఎంచుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ స్థలంలో ఎటువంటి కుంట పోరంబోకు, వాగు పోరంబోకు, అటవీ భూములు లేవని నిర్ధారించుకున్న తర్వాతే నివేదిక పంపినట్లు వివరించారు. అన్ని విధాల పరిశీలించే మంజూరు చేశారని అనుమానాలు వద్దని తెలిపారు.
ఇవీ చదవండి: 'అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి'