దీపావళి పండగ రోజూ గుంటూరులో విద్యుత్ ఉద్యోగులు నిరసనబాట వీడలేదు. డిమాండ్ల సాధనకు ఆరో రోజూ గుంటూరు విద్యుత్ భవన్ ఎదుట ఉద్యోగులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. అందరికీ వెలుగులు పంచే తమ జీవితాల్లో చీకట్లు నింపేందుకు ట్రాన్స్కో యాజమాన్యం ప్రయత్నిస్తుందని... తమ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని ఉద్యోగుల ఐకాస ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఉద్యోగులు గాంధేయమార్గంలో శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. అక్రమ నిర్బంధాలతో తమను అణచివేయాలని చూడటం ఎంతవరకు సబబని ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల వసంతరావు ప్రశ్నించారు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని.. సమ్మె ఉద్యోగుల ప్రాథమిక హక్కుని ఆయన అభిప్రాయపడ్డారు.
చర్చలకు ఐకాస ఎప్పుడూ సిద్ధమేనని... కొవిడ్ పేరుతో ట్రాన్స్కో యాజమాన్యం పదేపదే లేఖలు రాయడం హాస్యాస్పదమన్నారు. కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రోజుల్లో ఉద్యోగులు విధులు నిర్వర్తించిన విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ పెద్దఎత్తున ర్యాలీల ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తామని వసంతరావు వెల్లడించారు.
ఇదీ చూడండి: