గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ అగ్రహం వ్యక్తం చేశారు. భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణపై.. మేయర్ అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. గతంలో కార్పొరేటర్ టికెట్ కోసం.. కన్నా ఇంటి గేట్ వద్ద కూర్చున్న విషయం కావటి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. శ్మశాన వాటికల వద్ద రేట్లు ఫిక్స్ చేసి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందారని విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో ఇమామ్లకు, పాస్టర్లకు గౌరవ వేతనం పెంచిన ఘనత వైకపాది కాదా అని వ్యాఖ్యానించారు. కన్నా లక్ష్మీనారాయణకు కావటి క్షమాపణ చెప్పాలని..లేకుంటే భాజపా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని రామకృష్ణ హెచ్చరించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్నా..రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందన్నారు. పీఎం కేర్ నుంచి పంపించిన 90 వెంటిలేటర్లు ఇంకా తెనాలి ఆసుపత్రి స్టోర్ రూంలోనే ఉన్నాయన్నారు. ఆ వెంటిలేటర్లను వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్కు వినతిపత్రం అందించినట్లు రామకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురండి: హైకోర్టు