ఇసుక రేవుల్లో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బంది మోసం చేస్తున్నారంటూ గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యలపై వారు నిరసన తెలిపారు. దీంతో పలు జిల్లాల్లో ఇసుక లోడింగ్కు అంతరాయం కలిగింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పరిధిలో కొనసాగుతున్న రీచ్ల్లో దాదాపు రెండు వేల మంది పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు. పలు జిల్లాల్లో వీరు ఆందోళనల్లో పాల్గొని, జిల్లా ఇసుక అధికారి, సంయుక్త కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు రీచ్ల్లో సాయంత్రం వరకు బిల్లింగ్ చేయకుండా నిరసన తెలిపారు. దీంతో ఇసుక లోడింగ్కు వచ్చిన లారీలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. అధికారులు సర్దిచెప్పడంతో సాయంత్రం నుంచి బిల్లింగ్ ఆరంభించారు.
కొత్త విధానంలో కొనసాగించాలి
ఇంతకాలం కష్టపడి పనిచేసిన తమను మోసగాళ్లుగా వ్యాఖ్యానించడం సరికాదని పొరుగుసేవల సిబ్బంది పేర్కొంటున్నారు. మురళీ మ్యాన్పవర్ సంస్థ కింద విధుల్లో చేర్చుకుని తర్వాత ఆప్కాస్లోకి తీసుకుంటామన్నారని...కానీ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఏజెన్సీ పరిధిలోకి మార్చినట్లు తెలిపారు. కొత్త విధానంలో టెండరు దక్కించుకున్న సంస్థ తమను కొనసాగించేలా చూడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ అధికారులకు వినతిపత్రాలు అందజేశామని చెప్పారు. అయితే ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదన్నారు. ఈ పొరుగు సిబ్బందిని విధుల్లో కొనసాగించాలని ఏపీఎండీసీ ఇసుక ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కన్వీనర్ సీహెచ్.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'కరోనా మన చుట్టూ తిరుగుతోంది.. జాగ్రత్తలు పాటించండి'