ప్రశాంతంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గంలో వైకాపా నేత తోట త్రిమూర్తులు కులాల ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రశ్నించారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలంతా కలసి ఉంటారన్న ఎమ్మెల్యే... తొడలు కొట్టే కొత్త సంప్రదాయాన్ని మండపేటకు తీసుకురావాలని చూస్తున్నారా అంటూ తోట త్రిమూర్తులును ప్రశ్నించారు.
ముఖ్యంగా కాపులకు తెదేపా ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపిస్తున్న తోట... 2019 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తాను ఫలానా కులానికి ఇంత చేశానని ఎక్కడా మాట్లాడలేదని... అయినప్పటికీ తోట కులాల ప్రస్తావన తీసుకురావడం సమంజసం కాదన్నారు. వీటన్నింటిపై ఆత్మ విమర్శ చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.