వీడని వరుణుడు.. వర్షంలోనే రోజువారీ పనులు - తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లాను వానలు వీడటం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు నిండి రోడ్లపై నీరు పారుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి పనులు సైతం ప్రజలు వర్షంలోనే కానిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే.. మరొవైపు నిత్యం జోరు వానలు కురుస్తున్నాయి. రాజమహేంద్రవరంలో 15 రోజులుగా రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంది. రహదారులపై మురుగునీరు ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడలోనూ అదేవిధంగా రోజూ వర్షం కురుస్తోంది. సినిమా రోడ్డు, మెయిన్రోడ్డు లోతట్టు ప్రాంతాల్లో డ్రెనేజీ నీరు పొంగిపొర్లితోంది. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
నేడు కూడా జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, జగ్గంపేట, అనపర్తి, పెద్దాపురం, కాకినాడ, మండపేట నియోజకవర్గాల్లో వర్షం పడింది. ఆత్రేయపురం, కడియం, రామచంద్రపురం, కొత్తపేట మండలాల్లో జోరు వాన పడింది. కరోనా విజృంభణతో పాటు రోజూ కురుస్తున్న వర్షాలతో జనం అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికే.. చాలా ప్రాంతాల్లో వరి నారుమళ్లు, నాట్లు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.