తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఇకపై నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా రాత్రివేళల్లో కొండపై బస చేసే భక్తులకు అల్పాహారం అందించేందుకు దేవస్థాన ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఆదివారం రాత్రి చైర్మన్ రోహిత్ అధ్యక్షతన ప్రస్తుత ధర్మకర్తల మండలి చివరి సమావేశం జరిగింది. రాత్రివేళ ఆహారం కోసం భక్తులు ఇబ్బంది పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటల నుంచి అన్నదాన భవనంలో కరాచీ ఉప్మా, టమాటా బాత్, మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సాంప్రదాయ వస్త్ర నిబంధన దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ముందు ఆర్జిత సేవలు, నిత్య కల్యాణం, వ్రతాలకు అమలు చేయాలనీ.. తరవాత దర్శనాలకు అమలు చేయాలనుకుంటున్నారు. ఇవికాక దేవస్థానంలో భద్రతా ఏర్పాట్లు, ప్రాథమిక వైద్య సేవలు, అన్నదాన భవన నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.
ఇవీ చదవండి..