చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. పాఠశాల విద్యా శాఖ సవరించి జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం బదిలీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల ప్రొవిజనల్ సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. ఆ జాబితాపై ఉపాధ్యాయులు తెలిపిన అభ్యంతరాల పరిశీలన కార్యక్రమం దాదాపు పూర్తి కావచ్చింది. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో 1,547 ఉపాధ్యాయ కొలువులను బ్లాక్ చేశారు. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు 1,936 మంది ఉన్నట్లు నిర్ధరించారు. జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు 4,084 ఉండగా.. వీటిలో 2,537 ఖాళీలను ప్రదర్శించారు.
ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి 1,547 ఖాళీలను బ్లాక్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలను బ్లాక్ చేస్తే తప్పనిసరిగా బదిలీ కావాల్సినవారు తమకు నచ్చిన పాఠశాలను కోరుకునే అవకాశం లేకుండా పోతుందంటున్నారు. ఇదే విషయమై డీఈవో రేణుకతో ‘న్యూస్టుడే’ మాట్లాడగా పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కొన్నింటిని బ్లాక్ చేశామన్నారు.
నిబంధనల ప్రకారం తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులకు అవసరమైన సంఖ్యలో మాత్రమే ఖాళీలను ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి పది శాతం ఎక్కువ ఖాళీలను, ఎస్జీటీ కేటగిరీకి సంబంధించి ఐదు శాతం ఎక్కువ ఖాళీలు చూపాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎస్జీటీ కేటగిరీకి సంబంధించి ఐదు కంటే ఎక్కువ శాతం ఖాళీలను జాబితాలో చూపామన్నారు. ఇలా కొన్ని ఖాళీలను బ్లాక్ చేయకుంటే కొన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో, మరికొన్ని పాఠశాలల్లో తక్కువ స్థాయిలో ఉపాధ్యాయులు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
ఇదీ చదవండి: