School students agitation for Teachers : అక్షరాలు దిద్దాల్సిన చేతులు నిరసన నినాదాలు చేశాయి. పాఠాలు చదవాల్సిన గొంతులు ఉపాధ్యాయులు కావాలంటూ నినదించాయి. మేము చదువుకుంటాం...మా బడికి టీచర్లను పంపండీ.. అని ఆ విద్యార్ధులంతా రోడ్డుపై బైఠాయించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చోటు చేసుకుంది. కుప్పం మండలం గుండ్ల మడుగు ప్రాథమిక పాఠశాల చిన్నారులు రోడ్డెక్కారు. తమ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించమంటూ రోడ్డు పై బైఠాయించి నినదించారు.
గుండ్లమడుగు ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 162 మంది విద్యార్ధులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు పాఠాలు బోధించాల్సి ఉంది. గుండ్లమడుగు బడిలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ఒకరిని సమీపంలోని సిద్దప్పనూరు పాఠశాలకు డిప్యూటేషన్ పై వేశారు. మరో ఉపాధ్యాయురాలు సెలవుపై వెళ్ళడంతో స్కూల్ లో ఇద్దరు మాత్రమే పాఠాలు బోధిస్తున్నారు. 162 మంది విద్యార్ధులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉండటాన్ని నిరసిస్తూ పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండి : Vaccination Guidelines: 15-18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్.. మార్గదర్శకాలు విడుదల