చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం సీ.రామాపురంలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి సొంతం చేసుకొనేందుకు యత్నించిన కొందరు అక్రమార్కులు.. రెవెన్యూ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 28లో 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో కొంత భాగాన్ని నవరత్నాల పథకంలో భాగంగా రామచంద్రాపురం మండలానికి చెందిన 30 మంది పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించారు. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు 2007 సంవత్సరంలో 8 మందికి పట్టాలు ఇచ్చినట్లు నకిలీ పట్టాలు సృష్టించారు. రెండు నెలల క్రితం సీ.రామాపురం గ్రామ రెవెన్యూ అధికారితో సంతకాలు చేయించి నకిలీ పట్టాలు సృష్టించారు.
కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి సొంతం చేసుకునే లక్ష్యంతో నకిలీ పట్టాలు సృష్టించిన తీరుపై గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్.. చిత్తూరు ఆర్డీఓ రేణుకను విచారణకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆర్డీఓ విచారణ నిర్వహించడంతో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో రామచంద్రాపురంలో తహసీల్దారుగా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన అధికారి సహకారంతో నకిలీ పట్టాలు సృష్టించినట్లు అధికారుల విచారణలో వెలుగుచూసింది.
ఆర్డీఓ తన ప్రాథమిక విచారణలో నకిలీ పట్టాలు సృష్టించినట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం కలెక్టర్ నివేదిక సమర్పించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఇంటి పట్టాలను రద్దు చేయడంతో పాటు అక్రమాకలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోనున్నారు.
ఇదీ చూడండి:
RRR letter: 'పట్టింపులకు పోకండి.. బోర్డు పరీక్షలు ఇప్పటికైనా రద్దు చేయండి'