రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానాన్ని వేదికగా నిర్ణయించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి మాదిరి జగన్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కలల మంత్రివర్గంలో అవకాశం కోసం ఆశావాహుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రెండోసారి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకోగా... నిన్నటి వైకాపా శాసన సభాపక్ష సమావేశానికి ముందు, తర్వాత పార్టీ అధ్యక్షుడు జగన్ను కలిశారు. అభినందనలు తెలియజేస్తూనే... మీతో కలిసి పని చేయాలనుందని మనసులో మాట వెల్లడించారు. ఎవరికీ జగన్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది. కొత్త వారికీ అవకాశముంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సీనియర్లకు అవకాశం!
డిప్యూటీ సీఎం పదవి ఈసారి ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. సీనియర్ ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్లు దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అమాత్య పదవులు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.
సీమలో సీటెవరికో?
అనంతపురం జిల్లా నుంచి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తదితరుల పేర్లు ఆశావహుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తొలి నుంచీ జగన్కు అండగా ఉన్న కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
జూన్ మొదటి వారంలో 18 నుంచి 20 మంది సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశాలుంటాయని తెలుస్తోంది. ఎప్పుడైనా సరే... తమకూ ఓ అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు.
ఇదీ చదవండీ: కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు