ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం-కిసాన్) అమలులో మెరుగైన పని తీరు కనబర్చిన రాష్ట్రాలు, జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు అందజేసింది. పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ఆయా రాష్ట్రాల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లకు అవార్డులు అందజేశారు. పీఎం కిసాన్ ఖాతాలకు ఆధార్ కార్డుల అనుసంధానం, పరిశీలన కేటగిరిలో అనంతపురం జిల్లా, రైతుల ఫిర్యాదుల పరిష్కారం విభాగంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు అవార్డులు దక్కాయి. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్బాబు కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారాలు స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వై.రామకృష్ణ, వై.ఆనందకుమారి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సీడ్యాక్సెస్ రోడ్డును వదిలేసి కరకట్ట రోడ్డుకు తొలి ప్రాధాన్యం