అనంతపురం జిల్లా ధర్మవరంలో నకిలీ డి పట్టా, నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసి ఒక్కొక్కటి రూ.లక్ష చొప్పున విక్రయించాడో ఓ వ్యక్తి. తహసీల్దార్ కార్యాలయంలో ఇదివరకు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన వ్యక్తి ఈ నకిలీ దందాకు తెరతీసి లక్షలు వసూలు చేశాడు. ధర్మవరం మండలం గొట్లూరు, చిగిచెర్ల, కోనుతూరు రెవెన్యూ గ్రామాల పరిధిలో విలువైన భూముల సర్వే నెంబర్లను సేకరించి వాటిని నకిలీ పాసుపుస్తకాలు తయారుచేయించాడు ఆ వ్యక్తి. వీఆర్వో, తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి డి పట్టా పాస్ పుస్తకాలు పలువురికి విక్రయించాడు. ఆన్లైన్లో భూముల వివరాలు లేకపోవడంతో మోసపోయామని గమనించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. రెండేళ్ల క్రితమే పట్టాదారు పాసు పుస్తకాలు సేకరించి వాటిలో సర్వే నెంబర్లు నమోదు చేసి నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నుంచి నకిలీ పాస్ పుస్తకాల పేరుతో రూ.కోటి వరకు తయారీదారుడు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి. video viral: పనిచేసిన చోటే కూలీల నుంచే డబ్బులు వసూలు