ఇసుక కొత్త విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్రెడ్డి అనంతపురం జిల్లా కదిరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అన్నారు. గడిచిన అయిదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన బాటలోనే వైకాపా ప్రభుత్వం నడుస్తోందని... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదన్నట్లుగా పాలన సాగుతోందన్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలోనూ... లంచాలు తీసుకుంటూ అవినీతికి బాటలు వేస్తోందని విమర్శించారు. ఈ విధానాన్ని మార్చుకోకపోతే తెదేపాకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. నీతిమంతమైన పాలనతో దేశ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2024 లో ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండీ :రేపు గవర్నర్తో సీఎం జగన్ భేటీ