అనంతపురం జిల్లా రైతులకు.. ద్రాక్ష తోటలు సిరులు పండిస్తున్నాయి. గింజలున్న దిల్ఖుష్ రకం ద్రాక్షకు ఒడిశాలో మంచి డిమాండ్ ఉండటంతో.. ఏటా కర్ణాటక వ్యాపారులు అక్కడికి ఎగుమతి చేసి సొమ్ము చేసుకునేవారు. అయితే.. అకాల వర్షాలతో కర్ణాటకలో ద్రాక్షతోటలు దెబ్బతినడంతో.. అక్కడి వ్యాపారులు సరిహద్దులోని అనంతపురం జిల్లాకు క్యూ కట్టడుతున్నారు. దీంతో.. మంచి ధర లభిస్తోంది.
ఏటా ఇక్కడి దళారులు కొనుగోళ్లు జరిపి.. కర్ణాటక వ్యాపారులకు విక్రయించే వాళ్లు. దీంతో.. రైతులు గిట్టుబాటు ధర రాక నష్టపోయేవారు. ఈసారి వ్యాపారులే నేరుగా కొనుగోళ్లు జరపుతుండటంతో కిలో ద్రాక్షకు 50 నుంచి 55 రూపాయలు ధర పలుకుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గింజలున్న ద్రాక్ష ఏటా ఎకరాకు 15 నుంచి 17 టన్నులు మాత్రమే దిగుబడి రాగా.. ఈసారి 19 టన్నుల వరకు వచ్చింది. కొందరు రైతులు ఎకరాకు 20 టన్నులు కూడా సాధించారు. అయితే.. అకాల వర్షాలు 15 నుంచి 20 శాతం పంటను నష్టపరిచాయి. దిగుబడి, ధర అధికంగా ఉండటంతో ఆ నష్టాలు మంచి ధర రూపంలో భర్తీ అయిందని రైతులు చెబుతున్నారు. ద్రాక్ష నాణ్యతగా ఉండటం వల్లే.. రైతులకు మంచి ధరలు వచ్చాయని ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు.
ఇదీ చూడండి: MISSING: బద్వేలులో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు అదృశ్యం..ఏమయ్యారు?