భారతదేశంలో మహిళల క్రికెట్కు తమ మద్దతు ఉంటుందని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ ఆదివారం ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న మహిళల టీ20 ఛాలెంజ్కు జియో, రిలయన్స్ ఫౌండేషన్, ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ స్పాన్సర్గా ఉంటుందని వెల్లడించారు.
"మహిళల టీ20 ఛాలెంజ్ను నిర్వహిస్తున్నందుకు బీసీసీఐకి నా హృదయపూర్వక అభినందనలు. భారత్లో మహిళల క్రికెట్ అభివృద్ధికి ఇదో ముందడుగు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి మా పూర్తి సహకారాన్ని అందించడం ఆనందంగా ఉంది. క్రీడాకారులందరి సామర్థ్యాలపై నాకు అపారమైన నమ్మకం ఉంది. రెండేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత మహిళా క్రికెటర్లు సాధించిన అద్భుత విజయాలతో దేశాన్ని గర్వించే విధంగా చేశారు. ఇలాంటి ప్రతిభ ఉన్న మహిళా క్రికెటర్లకు మౌలిక సదుపాయాలు, శిక్షణ, పునరావాస సౌకర్యాలను అందేలా చూడటం మా లక్ష్యం. అంజుమ్, మిథాలీ, స్మృతి మంధాన, హర్మన్ప్రీత్, పూనమ్ యాదవ్ గొప్ప రోల్మోడల్స్. టీమ్ఇండియాలోని ప్రతి మహిళా క్రికెటర్ గొప్ప విజయాన్ని, కీర్తిని సంపాందించాలని కోరుకుంటున్నా."
-నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు
నేవీ ముంబయిలోని జియో స్టేడియంలో టీమ్ఇండియా మహిళా క్రికెటర్లకు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు నీతా వెల్లడించారు. ఏడాది పొడవునా ట్రయల్స్, క్యాంప్లు, పోటీ మ్యాచ్లను నిర్వహించడానికి ఉపయోగించుకోవచ్చవని ఆమె తెలిపారు. వీటితో పాటు మహిళా క్రికెటర్లు ముంబయిలోని ప్రఖ్యాత రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్లో వసతితో పాటు క్రీడా విజ్ఞాన సదుపాయాల నుంచి ప్రయోజనం పొందవచ్చని స్పష్టం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహిస్తోంది. యూఏఈలోని షార్జా వేదికగా సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ అనే మూడు టీమ్లు తలపడనున్నాయి. ఈ జట్లకు హర్మన్ప్రీత్ కౌర్,స్మృతి మంధాన, మిథాలీ రాజ్లు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. నవంబరు 4 నుంచి మహిళల టీ20 ఛాలెంజ్ ప్రారంభం కానుంది.