శేషాచల అడవులు ఎర్రచందనం స్మగ్లర్ల అడ్డాగా మారాయి. నిరంతరం అధికారులు కూంబింగ్ కొనసాగుతున్నా... స్మగ్లర్లు అడ్డదారుల్లో ఎర్రచందనం దుంగలను దోపిడీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన అడవుల్లో భాకరాపేట అటవీశాఖ అధికారులు బుధవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో నల్లబండ బోడు వద్ద స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకొస్తూ.. అధికారులకు తారసపడ్డారు. స్మగ్లర్లు రాళ్ల దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం అధికారులు గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఎర్రచందనం స్మగ్లర్లు.. దుంగలను పడవేసి దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.
అధికారులు పరిసర ప్రాంతాల్లో గాలించి 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన దుండగుల కోసం అదనపు బలగాలతో గాలింపు చేపట్టారు. దుంగలను భాకరాపేట అటవీశాఖ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎఫ్.ఆర్.ఓ పట్టాభి తెలిపారు.
తమిళ స్మగ్లర్ అరెస్ట్..
మరోవైపు.. చంద్రగిరి మండలంలో బి.కొంగరవారిపల్లి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. విద్యుత్ ఉప కేంద్రం పైభాగంలో ఆరుగురు తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారులను చూసి ఐదుగురు దుండగులు తప్పించుకున్నారు. ఐదు దుంగలతో పాటు.. ఓ తమిళ స్మగ్లర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:
devineni uma released: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి.. దేవినేని ఉమా విడుదల