కొవిడ్ మహమ్మారిని అదుపు చేయడానికి టీకా వస్తుందని అందరిలోనూ ఆశాభావముంది. అది వస్తే.. ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు ఎలా అందించాలనే అంశంపై శనివారం ట్రయల్రన్ (డ్రైరన్) నిర్వహించారు. అధికారులు అనుకుంది అనుకున్నట్లు జరిగినా అక్కడక్కడా కొన్ని సాంకేతిక, నిర్వహణా ఇబ్బందులు తలెత్తాయి.
విశాఖనగరంలోని ఈఎన్టీ, ప్రథమ ఆసుపత్రి, సింహాచలంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో శనివారం డ్రైరన్ జరిగింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి నిర్వహించిన ఈ ప్రక్రియలో ప్రతి కేంద్రం నుంచి 25 మందిని ఎంపికచేశారు. ఒక వ్యక్తి వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చినప్పటినుంచి.. పత్రాల తనిఖీ, వేచి ఉండే సమయం, నమూనా వాక్సిన్ వేయించుకునేవరకు కనీసం 15 నిమిషాలు, గరిష్ఠంగా 20నిమిషాల సమయం పట్టింది. ఆయా ఆసుపత్రుల్లో ఆరోగ్యసిబ్బందినే ఈ డ్రైరన్ కోసం ఎంపిక చేశారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ:
మూడు కేంద్రాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ ప్రక్రియపై కలెక్టర్ వినయ్చంద్, జేసీలు వేణుగోపాల్రెడ్డి, అరుణ్బాబు, గోవిందరావు పర్యవేక్షించారు. ఏర్పాట్లని, లోపాల్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ వచ్చాక.. ప్రస్తుత ఏర్పాట్లలో ఇంకా ఎలాంటి సవరణలు చేయాలో ఆయా ఆసుపత్రుల యంత్రాంగంతో చర్చించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కొవిడ్ ప్రత్యేకాధికారి డాక్టర్ పీవీ సుధాకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తొలివిడతలో 34,767మందికి వ్యాక్సిన్: కలెక్టర్
* మొదటి విడతలో 34,767 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు కలెక్టర్ వినయ్చంద్ తెలిపారు. శనివారం ఈఎన్టీ ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడారు. ఆశావర్కర్లు, నర్సింగ్ సిబ్బంది, వైద్యులు, పరిపాలన విభాగ సిబ్బందికి తొలిగా వ్యాక్సిన్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. * వ్యాక్సిన్ వేసే ముందే వారందరి వివరాల్ని కొ-విన్ సాఫ్ట్వేర్లో పొందుపరిచి, క్రమసంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 1.5 మి.లీ చొప్పున వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఒక్కొక్కరికి మూడు డోసుల వ్యాక్సిన్ అవసరముంటుందని చెప్పారు. ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలు నమోదుచేసేటప్పుడు, వ్యాక్సిన్ వేసుకున్నాక వారివారి మొబైల్నెంబర్లకు సందేశాలు వస్తాయన్నారు. * రెండో విడతలో పరిపాలన, పారిశుద్ధ్య, రెవెన్యూ, ఎన్.ఎస్.ఎస్, ఎన్.సి.సి విభాగాల వారికి వ్యాక్సిన్ వేస్తామన్నారు. మూడోవిడతలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, 50 ఏళ్లపైనున్నవారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇదే విడతలో దీర్ఘకాలిక రోగాలున్న 50 ఏళ్లలోపున్నవారికీ వేస్తామన్నారు.
* విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు సరఫరా చేయాల్సిన వ్యాక్సిన్లను విశాఖలోని ప్రాంతీయ నిల్వ కేంద్రంలో ఉంచుతామని వెల్లడించారు. ప్రస్తుతం ఏడు లక్షల వ్యాక్సిన్లను నిల్వచేసే సామర్థ్యముంందని తెలిపారు.

లోపాలు ఏంటంటే...
- వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వ్యక్తికి సంబంధించి వ్యక్తిగత సమాచారాన్ని ఒక రోజు ముందే యంత్రాంగం ఆన్లైన్లో అప్లోడ్ చేసింది. వారి ఆధార్కు ఏ ఫోన్ నంబరైతే లింక్అయి ఉందో దానికే ఓటీపీ వెళ్తుండటంతో కొంత గందరగోళం తలెత్తింది. ఆ నెంబర్లు సంబంధిత వ్యక్తి దగ్గర లేకపోవడం ఓ సమస్య అయితే, కొందరి వద్ద సెల్ ఉన్నా ఓటీపీ రాలేదు.
- ఆన్లైన్ ఎంట్రీ అవగానే ఆయా వ్యక్తులకు ఏయో కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తారు, ఏ సమయంలో వేస్తారనే స్లాట్కు సంబంధించిన మేసేజ్లు కొందరి ఫోన్లకు రాలేదు.
- ఎంపిక చేసిన వ్యక్తులు వ్యాక్సిన్ కేంద్రానికి రావడం, అక్కడ ధ్రువపత్రాల పరిశీలన, కాసేపు వేచిఉండటం, ఆ తర్వాత వ్యాక్సిన్ గదిలోకి పంపడం లాంటి ప్రక్రియలో లోపాలు కనిపించలేదు.
- ఇదివరకు ఆరోగ్యసిబ్బంది వ్యాక్సిన్ను పిల్లలు మాత్రమే వినియోగించేవారు. ఈసారి పెద్దవారికి వేస్తుండటం, అందులోనూ వేసే సమయంలో ఆ వ్యాక్సిన్ గురించి ప్రతీ ఒక్కరికి వివరించిచెప్పడం, దుష్పరిణామాలు వస్తే ఏం చేయాలనే వివరాలు చెప్పడంలో కాస్త కంగారు కనిపించింది.
- డ్రైరన్లో వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన ఇద్దరు సిబ్బంది అనివార్య కారణాలతో హాజరుకాలేకపోయారు. ఈ సమయంలో ఏం చేయాలనేది అక్కడి ఆసుపత్రి సిబ్బంది ఇబ్బందిపడ్డారు. ట్రయల్రన్లో భాగంగా వారి స్థానంలో మరో ఇద్దరి సిబ్బందిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది.
- వ్యాక్సిన్ వేయగానే ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియలో లోపాలు రాలేదు. టీకా వేయగానే అదే గదిలో ఐదు నిమిషాలు కూర్చోబెట్టారు. ఆతర్వాత పరిశీలన గదిలో మరో అరగంట ఆ వ్యక్తి ఆరోగ్య స్థితిని పరిశీలించారు.
- ముందు జాగ్రత్తలో భాగంగా ప్రతి ఆసుపత్రిలో ఒకరు స్వల్ప అస్వస్తతకు గురైనట్లు, మరొకరు తీవ్ర అస్వస్తతకు గురైనట్లు ట్రయల్రన్ నిర్వహించారు. స్థానిక కేంద్రంలోనే వైద్యులసాయంతో చికిత్సలు చేయడం, ఇబ్బంది అయితే సమీపంలోని ఆసుపత్రికి ఆంబులెన్స్లో వేగంగా తరలించడం లాంటివి చేశారు.
- వేచి ఉండే గదుల్లో కొన్నిసార్లు భౌతికదూరం పాటించే విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఆయా కేంద్రాల్లో 108, 104 వాహనాల్ని అందుబాటులో ఉంచారు.
ఇదీ చదవండి: