నేటి నుంచి సాగు పనులకు మినహాయింపు ఇస్తూ కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలవుతాయి. మిగిలిన 377 జిల్లాల్లో కంటెయిన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది.
ఈ-కామర్స్ సంస్థలు సరఫరా చేసే అన్ని వస్తువులకూ ఇటీవల మినహాయింపునిచ్చిన హోంశాఖ ఆదివారం ఆ వెసులుబాటును రద్దు చేసింది. టీవీలు, ఫ్రిజ్లు, కంప్యూటర్లు వంటివి కాకుండా అత్యవసర వస్తువుల సరఫరాకు మాత్రమే అనుమతిచ్చింది. వస్తువుల జాబితా సుదీర్ఘంగా ఉన్నందున వాటన్నింటినీ అనుమతిస్తే కచ్చితంగా లాక్డౌన్పై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో కొన్నింటినే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని రాష్ట్రాలు ఆంక్షల్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.
తప్పులు చేయొద్దు సుమా...
పనులు పునః ప్రారంభించే సమయంలో ఎలాంటి తప్పులూ చేయొద్దని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. వెసులుబాట్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఇప్పుడున్న పరిస్థితిని యథాతథంగా కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నించాలని అప్రమత్తం చేసింది. అవసరమనుకుంటే కేంద్రం విధించిన ఆంక్షలకు అదనంగా మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత తొలిసారి పాక్షిక మినహాయింపులను అమల్లోకి తెస్తున్నందున ఈ కాలానికి కేంద్రం చాలా ప్రాధాన్యం ఇస్తోంది. వచ్చే ఫలితాలు బట్టి భవిష్యత్తు కార్యాచరణకు మార్గం చూపే అవకాశం ఉంది.
ప్రాంగణాల్లోనే కార్మికులకు వసతి
పనులు ప్రారంభించే భారీ పరిశ్రమలు, పారిశ్రామికవాడలు, పారిశ్రామిక సముదాయాల ప్రాంగణాల్లోనే కార్మికులకు వసతులు కల్పించాలని నిర్దేశించింది. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని కార్మికులకు లాభదాయకమైన ఉపాధి కల్పించడానికి వీలవుతుందని అంచనా. వ్యవసాయ, ఉపాధి పథకం పనుల ద్వారా గ్రామీణ ప్రజలకు సాధ్యమైనన్ని ఎక్కువ పనులు కల్పించడానికి జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఉన్న కార్మికులకు నాణ్యమైన భోజనం అందించి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. వలస కూలీలు కొన్ని షరతులకు లోబడి తాము ప్రస్తుతం ఉంటున్న రాష్ట్ర పరిధిలోనే పని ఉన్న ప్రాంతాలకు అనుమతులు తీసుకుని వెళ్లొచ్చని, లాక్డౌన్ ఉన్నప్పుడు రాష్ట్రం దాటి వెళ్లడానికి మాత్రం వీల్లేదని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు.
మినహాయింపులు ఇచ్చిన ప్రాంతాల్లో...
* ఎలాంటి ప్రజారవాణాను అనుమతించకూడదు.
* ట్యాక్సీలు, ఆటోలు, సైకిల్ రిక్షాలు, క్యాబ్ అగ్రిగేటర్లు నడవడానికి వీల్లేదు.
* విద్యాసంస్థలు, వాటి అనుబంధ కార్యక్రమాలు, సినిమా హాళ్లు, మాళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, వినోద పార్కులు, అన్ని రకాల సామాజిక, మత, రాజకీయ, క్రీడా, వినోద కార్యక్రమాలూ మే 3వరకూ పూర్తిగా బంద్ చేయాల్సిందే.
హాట్స్పాట్స్లో అనుమతుల్లేవ్
* అధిక సంఖ్యలో కొవిడ్ కేసులున్న ప్రాంతాలు, నాలుగు రోజుల్లోపు కేసులు రెట్టింపు అవుతున్న ప్రాంతాలను హాట్స్పాట్స్గా గుర్తించాల్సి ఉంటుంది.
* ఇక్కడ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కంటెయిన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలి.
* ఈ కంటెయిన్మెంట్ జోన్లలో ఎలాంటి మినహాయింపులూ వర్తించవు. అత్యవసర సేవలు మినహా మిగతా ఎలాంటిపనులూ చేపట్టడానికి వీల్లేదు.
అనుమతులు వీటికే..
* సాగు పనులు నేటి నుంచి
* ఆయుష్తోసహా అన్ని రకాల వైద్యసేవలు
* గ్రామీణ ఉపాధి హామీ పనులు.
* ఐటీ, ఐటీ ఆధారిత సేవలు (50% సిబ్బందితో)
గ్రామ పంచాయతీల స్థాయిలో ప్రభుత్వ ఆమోదం ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లు
* కొరియర్ సర్వీసులు
* ఎలక్ట్రీషియన్, ఐటీ రిపేర్లు, ప్లంబర్లు, మోటారు మెకానిక్లు, కార్పెంటర్ వంటి స్వయం ఉపాధి సేవలు
* నిర్మాణ స్థలంలో కార్మికులు అందుబాటులో ఉంటే పట్టణ ప్రాంతాల్లో ఆగిపోయిన నిర్మాణ పనుల కొనసాగింపు (బయటినుంచి ఎలాంటి వర్కర్లను తీసుకురాకూడదు)
* జాతీయ రహదారుల వెంబడి దాబాలు (ప్యాకింగ్లో ఉన్న ఆహారాన్నే విక్రయించాలి)
* ట్రక్కుల మరమ్మతు దుకాణాలు,
* ప్రభుత్వ కాల్సెంటర్లు
* అన్ని రకాల సరకు రవాణా వాహనాలు
* వ్యవసాయ యంత్రసామగ్రి, విడిభాగాల విక్రయ దుకాణాలు
* ఔషధాలు, వైద్య పరికరాలు తయారు చేసే యూనిట్లు
* మున్సిపల్, కార్పొరేషన్ సరిహద్దుల బయట గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పరిశ్రమలు
* దశలవారీ షిఫ్టులు, భౌతికదూరం నిబంధనలతో జూట్ పరిశ్రమలు.
* పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల నిర్మాణం.
* ఐటీ హార్డ్వేర్ తయారీ కేంద్రాలు
* గ్రామీణ ప్రాంతాల్లో ఇటుకల బట్టీలు.
* గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, భవనాలు, అన్నిరకాల పారిశ్రామిక ప్రాజెక్టులు, ఎంఎస్ఎంఈ కార్యకలాపాలు.
* మెడికల్, వెటర్నరీ కేర్, అత్యవసర వస్తువుల సేకరణ లాంటి అత్యవసర సేవల ప్రైవేటు వాహనాలకు అనుమతి.
ఇదీ చూడండి ఉపాధిపై కరోనా పిడుగు!