కృష్ణానది జలవిద్యుత్ ఉత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభమైంది. ఇరువైపులా న్యాయవాదులు గందరగోళం సృష్టిస్తున్నారని సీజే జస్టిస్ హిమాకోహ్లి అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదన్నారు. న్యాయమూర్తిపై అభ్యంతరాలుంటే పిటిషన్ వెనక్కి తీసుకోవాలని చెప్పారు. సీజే ధర్మాసనమే విచారణ చేపట్టాలని ఏజీ ప్రసాద్ కోరారు. నదీజలాల అంశం రోస్టర్ ప్రకారం సీజే ధర్మాసనానికి వస్తుందని అన్నారు.
మళ్లీ అభ్యంతరాలేంటి?
ప్రస్తుతం విచారణ జరుపుతున్న న్యాయమూర్తి ఏపీ వ్యక్తి కాబట్టి బెంచ్ మార్చాలని ఏజీ కోరారని పిటిషనర్లు తెలిపారు. పిటిషన్పై విచారణ చేపట్టాక మళ్లీ అభ్యంతరాలేంటని జస్టిస్ రామచంద్రరావు బెంచ్ ప్రశ్నించింది. ఏజీ తీరు దురదృష్టకరం అని జస్టిస్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై సీజే నుంచి స్పష్టత తీసుకొని నిర్ణయం చెబుతామని ధర్మాసనం తెలిపింది.
మేమే నిర్ణయిస్తాం
జల వివాదం పిటిషన్లకు సంబంధించి ఇరు వైపుల న్యాయవాదులు గందరగోళం సృష్టిస్తున్నారని చీఫ్ జస్టిస్ హిమాకోహ్లి అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదని చెప్పారు. న్యాయమూర్తిపై అభ్యంతరాలుంటే పిటిషన్ వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో మధ్యంతర పిటిషన్ వెనక్కి తీసుకుంటానని ఏజీ తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వెంకటరమణ పైనా సీజే అసహనం వ్యక్తం చేశారు. ఫలానా బెంచ్ కావాలని కోరడం పద్ధతి కాదని తెలిపారు. ఏ బెంచ్ విచారణ చేపట్టాలో తానే నిర్ణయిస్తానని సీజే వివరించారు.
కృష్ణా బేసిన్లో పూర్తి స్థాయి జలవిద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన జీవో 34ను సవాలు చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు జి.శివరామకృష్ణప్రసాద్, ఎం.వెంకటప్పయ్యలు తెలంగాణ హైకోర్టులో నిన్న లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
ఇదీ చదవండి: మిజోరాం గవర్నర్గా హరిబాబు- దత్తాత్రేయ బదిలీ