వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టిస్తూ.., సంక్షేమం కోసం అప్పులు (kanakamedala on ap financial status) చేస్తున్నామని చెప్పటం దుర్మార్గమని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ధ్వజమెత్తారు. కనీసం కాగ్కి కూడా అంతుచిక్కని విధంగా ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని దుయ్యబట్టారు. సంక్షేమం కోసం అప్పులు చేస్తుంటే ప్రతిపక్షాల అడ్డుపడుతున్నాయనడం హాస్యాస్పదమన్నారు. అప్పులకు లెక్కలు చెప్పకపోతే అవినీతిగానే పరిగణించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.
వ్యవస్థల్ని అనుకూలంగా మార్చుకుని ధరలు పెంచి చేసిన అప్పులను కొట్టేస్తున్నారని కనకమేడల ఆరోపించారు. రూ.50 ఉన్న ఛీప్ లిక్కర్ రూ.150కి అమ్మటం, యూనిట్ విద్యుత్ రూ.20కి కొనుగోలు చేయటం వీటికి ఉదాహరణలు అని వివరించారు. లిక్కర్, విద్యుత్ కంపెనీలకు వేలకోట్లు అదనంగా దోచిపెట్టి ముడుపులు కింద పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎటుపోతోందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కనకమేడల డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకంలోనూ అవినీతి ఉందన్న కనకమేడల.. ఆస్తులు తనఖా పెట్టడానికి ప్రభుత్వం కస్టోడియన్ మాత్రమే కానీ యజమాని కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేస్తున్న అప్పులు సంక్షేమానికి కాదు.. సంక్షోభానికి. ప్రజల కోసమే అప్పులని చెప్పడం హాస్యాస్పదం. కాగ్కు కూడా ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలి అర్థం కావట్లేదు. లెక్కలు చెప్పకపోతే అవినీతిగానే పరిగణించాల్సి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.- కనకమేడల రవీంద్ర కుమార్, తెదేపా ఎంపీ
ఇదీ చదవండి
chandrababu letter to pm modi : బీసీ జనగణన చేపట్టాలని ప్రధానికి చంద్రబాబు లేఖ