హిజ్రాలను తరచూ వేధించే వ్యక్తి కుర్మ వెంకటేశ్.. ఏపీ అనంతపురం రాప్తాడు మండలం కుక్కలపల్లికి చెందిన ఈయన... బతుకు దెరువు కోసం 2012లో హైదరాబాద్ వచ్చాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో దొంగతనాలు మొదలు పెట్టాడు. పలు కేసులు నమోదు కావడంతో పోలీసులు ఇతనిపై రౌడిషీట్ తెరిచారు. ముఖ్యంగా హిజ్రాలనే లక్ష్యంగా చేసుకుని వారిని బెదిరింపులకు గురిచేసి బలవంతంగా డబ్బులు వసూలు చేసేవాడు. ఇందులో భాగంగా 2014లో తన గ్యాంగ్తో కలిసి కృష్ణానగర్ ప్రాంతంలో ఉండే హిజ్రాలపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో శ్రీజ అనే హిజ్రా తీవ్రంగా గాయపడింది. హిజ్రాలు ప్రతినెలా మామూళ్లు ఇవ్వకపోతే కుర్మ వెంకటేశ్ వారిని శారీరకంగానూ హింసించేవాడు.
రెండు హత్యల్లో నిందితుడు
ఇందులో భాగంగానే 2016లో మామూళ్లు ఇవ్వకుండా ఎదురు తిరిగిన ప్రవళిక అనే హిజ్రాను కూకట్పల్లి సమీపంలో హత్య చేశాడు. ఈకేసులో అరెస్టయి జైలుకు వెళ్లాడు. ఇలా ఇతనిపై సనత్నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, గోపాలపురం ఠాణాల్లో 10 కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదు చేసిన హిజ్రలను కూడా కేసులు వెనక్కి తీసుకోమని బెదిరింపులకు గురిచేశాడు. 2018లో ఇతని అనుచరుడు సాయి పవన్తో కలిసి యాస్మిన్ అనే హిజ్రాపై మామూళ్లు ఇవ్వనందుకు దాడికి పాల్పడ్డారు. రాళ్లు విసిరి తీవ్రంగా గాయపరిచారు. ఇలా వరుసగా హిజ్రాలపై మామూళ్ల కోసం దాడులు చేసిన కుర్మ వెంకటేశ్పై ఒక్క బంజారాహిల్స్లోనే 4 కేసులు ఉన్నాయి. రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
వెంకట్ అరెస్ట్...
కుర్మ వెంకటేశ్ దాడులు భరించలేని హిజ్రాలు ఆందోళన బాట పట్టారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ఠాణా వద్ద వెంకటేశ్ను అరెస్ట్ చేయాలంటూ నిరసనలు చేపట్టారు. అంతటితో ఆగకుండా పశ్చిమ మండల డీసీసీ కార్యాలయాన్ని ముట్టడించి తమకు న్యాయం చేయాలని కోరారు. ట్విట్టర్ వేదికగా 'అరెస్ట్ వెంకట్' అంటూ యాష్ ట్యాగ్ను ప్రచారం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న హిజ్రాలు ఇందుకు మద్దతు పలికారు.
హిజ్రాల సంబురాలు
అతను గతేడాది బెయిల్పై విడుదల కావడంతో ఈ ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. కాగా 2019 అక్టోబర్లో డబ్బుల కోసం బెదిరిపులకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయ్యాడు. వరుస కేసుల్లో నిందితుడిగా ఉన్న కుర్మ వెంకటేశ్పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్నాడు. తాజాగా 2016లో హిజ్రాను హత్య కేసులో నాంపల్లి కోర్టు ఇతనికి జీవిత ఖైదును విధించింది. దీంతో హిజ్రాలు సంబరాలు జరుపుకున్నారు. ఓ నరరూప రాక్షసుడు బారి నుంచి తమను కాపాడారంటూ.. బంజారాహిల్స్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులను సన్మానించారు. శిక్ష పడేలా చేసిన కోర్టు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకూ చస్తూ బతికామని, తాము ఇప్పడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతామని తెలిపారు. స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.
ఇదీ చూడండి :